ఎపీ ఎంసెట్: అంతా టెన్షన్, ప్రైవేట్ వాహనాల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు
హైదరాబాద్: ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ సెట్ కోడ్ను మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని శ్రీనివాస్లు ఈరోజు విడుదల చేశారు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో ఇంజనీరింగ్ పేపర్ సెట్కోడ్ ఎన్1 పత్రాన్ని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ ఏపీలో జరిగే ఎంసెట్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధులకు పరీక్ష కేంద్రాల వద్ద వసతి సదుపాయలు కల్పించామన్నారు. పరీక్షకు కొంచెం ఆలస్యమైనా అనుమతిస్తామని ఆయన చెప్పారు. ఎపీ ఎంసెట్ పరీక్షకు సంబంధించి హైదరాబాద్లో 39 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్ పరీక్ష జరుగనుంది.
ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తున్న ఈ పరీక్షకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,55,142 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యార్ధులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
అగ్రికల్చరల్, మెడిసిన్ సెట్ కోడ్ను విడుదల చేసిన మంత్రి కామినేని
ఏపీ ఎంసెట్ అగ్రికల్చరల్, మెడిసిన్ సెట్ కోడ్ను వైద్య ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ విడుదల చేశారు. అగ్రికల్చరల్, మెడిసిన్ విభాగానికి ఎల్1 సెట్ను ఎంపిక చేసి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చిన రాజప్ప, మంత్రి గంటా, ఏపీ ఎంసెట్ ఛైర్మన్ వి.ఎస్.ఎస్.కుమార్, ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎంసెట్ పరీక్ష కోసం గుంటూరు పరిధిలోతిరగనున్న బస్సులు
గుంటూరు జిల్లాలో ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల కోసం ఎంసెట్ పరీక్ష నిర్వహించే ప్రాంతాల్లో శుక్రవారం ఒక్కరోజు ఆర్టీసీ బస్సులను తిప్పనున్నారు. విద్యార్ధులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ కార్మికులు వారంతట వారే ముందుకొచ్చారు.
ఎంసెట్ విద్యార్థులకు ప్రత్యేక వాహనాలు
శుక్రవారం ఎంసెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఏపీలోని పలు నగరాలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్చంధంగా తమ వాహనాలను విద్యార్దుల కోసం కేటాయించారు. పోలీసు, రెవెన్యూ, ప్రైవేటు సంస్థలు, ప్రజాప్రతినిధులు అన్ని సెంటర్లలో వాహనాలను ఏర్పాటు చేశారు.
గుంటూరులో వీవీఐటీ కాలేజీ యాజమాన్యం 50 బస్సులను ఏర్పాటు చేసింది. ఆర్టీసీ సమ్మె మూడోరోజుకు చేరుకోవడంతో అధికారులు ఎంసెట్ విద్యార్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గన్నవరం తహసీల్దారు మాధురి, ఎంసెట్ విద్యార్ధుల కోసం 14 వాహనాలను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications