భారతమ్మ జోలికొస్తే- లోకేష్కు అమర్నాధ్ వార్నింగ్: బ్రాహ్మణితో గొడవలు ఉంటే ..!!
అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతమ్మపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోన్నాయి. దీనిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. నారా లోకేష్పై ఎదురుదాడికి దిగుతున్నారు. మహిళల పట్ల టీడీపీ నాయకులకు ఎంత చులకన భావం ఉందో నారా లోకేష్ మాటలతో స్పష్టమౌతోందని విమర్శిస్తోన్నారు.

బ్రాహ్మణితో గొడవలు..
నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణల పట్ల మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. ఇంకోసారి భారతమ్మపై ఆరోపణలు చేస్తే తాట తీస్తానని హెచ్చించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన కొద్దిసేపటి కిందటే విలేకరులతో మాట్లాడారు. నారా లోకేష్-ఆయన భార్య బ్రాహ్మణికి ఏవైనా గొడవలు ఉంటే అవి వాళ్లు వాళ్లు తేల్చుకోవాలని అన్నారు. బ్రాహ్మణితో గొడవల వ్యవహారంతో వచ్చిన అసహనాన్ని ఇతరులపై చూపించొద్దని హితవు పలికారు.

చంద్రబాబు-బాలకృష్ణతో
నారా లోకేష్ లాగా ఇంట్లో ఆడవాళ్ల గురించి దుష్ప్రచారం చేసేంతటి నీచమైన మనస్తత్వం వైఎస్ఆర్సీపీలో ఎవరికీ లేదని అన్నారు. బ్రాహ్మణితో గొడవలు ఉంటే చంద్రబాబు-బాలకృష్ణను కూర్చోబెట్టుకుని పరిష్కరించుకోవాలని ఆయన నారా లోకేష్కు సూచించారు. బ్రాహ్మణిని తిట్టలేక తమ పార్టీ నాయకులతో తిట్టించడానికే వైఎస్ భారతమ్మ పేరును నారా లోకేష్ ప్రస్తావించినట్లు కనిపిస్తోందని గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు.

రాజకీయాల్లో లేని వ్యక్తులపై..
ఏ రోజు కూడా భారతమ్మ రాజకీయాల్లోకి రాలేదని గుర్తు చేశారు. రాజకీయాల్లో కొనసాగుతున్నందున తమపై నారా లోకేష్ విమర్శలు, దుష్ప్రచారాలు చేసినా వాటికి ధీటుగా సమాధానం ఇస్తామని, అంతేగానీ రాజకీయాల్లో లేని వారి గురించి మాట్లాడటం ఆయన రాజకీయ పరిజ్ఞానానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి తాము ఏదైనా మాట్లాడితే తండ్రికొడుకులిద్దరూ ఎదురెదురుగా కూర్చుని భోరుమని ఏడుస్తారని చురకలు అంటించారు.

శ్వేతపత్రం..
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము, ధైర్యం నారా లోకేష్కు ఉందా అంటూ గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయి? ఎంతమందికి ఉపాధి లభించిందనే విషయాన్ని బహిరంగంగా ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. వెయిట్ లాస్ కోసం వెళ్తే.. నారా లోకేష్కు మైండ్ లాస్ అయినట్టుగా ఉందని ఆయన విమర్శించారు.

తెలుగుదేశం నుంచి స్వాతంత్ర్యం ఎప్పుడు..?
జనసేన అధినేత పవన్ కల్యాణ్పైనా గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు ఎప్పుడు విముక్తి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తాయని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పగలడా? నిలదీశారు. చంద్రబాబు స్క్రిప్ట్, ప్రొడక్షన్, నాదెండ్ల దర్శకత్వంలో కాపు జనసేన కాదు, కమ్మ జనసేనగా ఆవిర్భవించిందని అన్నారు.












Click it and Unblock the Notifications