జెట్ స్పీడ్ లో నిర్ణయాలతో.. ఆ విద్యార్థుల భవిష్యత్ కాపాడిన మంత్రి లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసారి ఏర్పడిన టిడిపి కూటమి ప్రభుత్వం పాలనలో కొత్త పంధాను అనుసరిస్తున్న విషయం తెలిసిందే. టిడిపి కూటమి మంత్రులు ఎవరికి వారు ప్రజా సమస్యలను పరిష్కరించడం పైన గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఇక ఈసారి పాలనలో తన మార్కు చూపించడానికి ప్రయత్నం చేస్తున్న మంత్రి నారా లోకేష్ తాజాగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం 25 మంది ప్రతిభవంతులైన దివ్యాంగ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసానిచ్చింది.
దివ్యాంగ విద్యార్థుల సమస్యను పరిష్కరించిన లోకేష్
ప్రజలు తమకు అధికారం ఇచ్చింది ప్రజాసేవ చేసేందుకే అని నమ్మిన ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తమ భవిష్యత్తు ముగిసిపోయింది అనుకున్న 25 మంది ప్రతిభవంతులైన దివ్యాంగ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపారు. అధికారులను పరుగులు పెట్టించారు. దివ్యాంగ విద్యార్థులకు ఎదురైనటువంటి సున్నితమైన సమస్యను వేగంగా పరిష్కరించారు.

ఏపీ దివ్యాంగ విద్యార్థులకు సర్టిఫికెట్ లో ఆ కాలమ్
దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి లలో సీట్ల సాధింపుకు అర్హత ఉన్న దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం కారణంగా సీట్లను కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏపీలో దివ్యాంగ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నుండి మినహాయింపు ఉంది. సర్టిఫికెట్ లోను సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష వద్ద E(exemption) అని ఇస్తారు. ఇదే దేశంలోని ప్రఖ్యాత ఐఐటి, ఎన్ఐటి లలో సీట్లు సంపాదించడానికి అర్హత సాధించిన దివ్యాంగ విద్యార్థులకు శాపమైంది.
సర్టిఫికెట్ చెల్లదన్న ఐఐటీ అధికారులు.. లోకేష్ కు మెసేజ్ చేసిన విద్యార్థి
ఐఐటి మద్రాస్ అధికారులు 170 ర్యాంకు వచ్చిన ఒక దివ్యాంగ విద్యార్థికి సర్టిఫికెట్లో ఉన్న సెకండ్ లాంగ్వేజ్ వద్ద E అని ఉండడంతో ఆ విద్యార్థి ఉత్తీర్ణతకు కావలసిన ఐదు సబ్జెక్టులలో నాలుగు మాత్రమే ఉత్తీర్ణుడైనట్టు ఆ సర్టిఫికెట్ చెల్లదని వెల్లడించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో విద్యా శాఖ మంత్రి లోకేష్ కు పృథ్వీ సత్యదేవ అనే విద్యార్థి వాట్సాప్ నెంబర్ కు మెసేజ్ పెట్టారు.
అధికారులను పరుగులు పెట్టించి కొత్త మెమోలు ఇప్పించిన లోకేష్
ఈ మెసేజ్ తర్వాత అరగంటలోనే స్పందించిన లోకేష్ అధికారులను పరుగులు పెట్టించారు. వారి సమస్య పరిష్కరించవలసిందిగా ఆదేశించారు. ప్రతిభ ఉన్న ఏ విద్యార్థి సీటు కోల్పోకూడదని చొరవ చూపారు. E అని ఇవ్వడానికి బదులుగా అక్కడ మార్కులు ఇచ్చి వారికి మెమో జారీ చేయాలని ఆదేశించారు. దీంతో వెంటనే ఇంటర్మీడియట్ అధికారులు స్పందించి E ని కనిష్టంగా 35 మార్కులుగా పేర్కొంటూ అందుకు తగినట్టుగా విద్యార్థులకు మార్కులతో కూడిన మెమోలను జారీ చేశారు.
వారి కోసం జీవో జారీ
ఇక మార్కులతో కూడిన సర్టిఫికెట్ తీసుకువెళ్లిన విద్యార్థులకు కూడా తాము దానిని అంగీకరించబోమని ఏపీ ప్రభుత్వం నుంచి జీవో కావాలని ఐఐటి, ఎన్ఐటి ల అధికారులు మెలిక పెట్టారు. దీంతో మళ్లీ మంత్రి లోకేష్ కి ఫోన్ ద్వారా పృథ్వి సత్యదేవ్ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే జీవో విడుదల చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
నేడు ఐఐటీ, ఎన్ఐటీ లలో సీట్లు సాధించిన వారికి లోకేష్ సన్మానం
అవసరమైతే చెన్నై ఐఐటి అధికారులతో మాట్లాడాలని ఆగమేఘాల మీద జీవో విడుదల చేశారు. ఒక దివ్యాంగ విద్యార్థి లోకేష్ దృష్టికి తన సమస్యను తీసుకురావడంతో మొత్తం 25 మంది ప్రతిభావంతులైన దివ్యాంగ విద్యార్థులకు జాతీయ స్థాయిలో పేరు పొందిన ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ వంటి ప్రఖ్యాత విద్యా సంస్థలలో సీట్లు దొరికాయి. నేడు ప్రముఖ విద్యా సంస్థలలో సీట్లు సంపాదించిన దివ్యాంగ విద్యార్థులు అందరిని మంత్రి లోకేష్ అభినందించనున్నారు. తమ సమస్య తెలుసుకొని వెంటనే పరిష్కరించిన నారా లోకేష్ కు దివ్యాంగ విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications