చంద్రబాబు తర్వాత నేనే: నారాయణ ఆసక్తికర వ్యాఖ్య, ఆగ్రహం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో నారాయణ కీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. భూసేకరణ దగ్గర నుంచి రాజధాని కాంట్రాక్టర్ను నిర్ణయించడం, మాస్టర్ ప్లాన్ తదితరాల్లో నారాయణ పాత్ర కీలకం.
ఈ విషయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. నారాయణ రాజధాని నిర్మాణం మొత్తం బాధ్యత తనదే అన్నట్లుగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణ గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజధాని నిర్మాణం విషయంలో సీఎం చంద్రబాబు తర్వాత బాధ్యత మొత్తం తనదేనని చెప్పారు. సీఆర్డీఏలో తనదే హవా అంటూ కొందరు చేస్తున్న విమర్శలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా, రాజధాని అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తానని చెప్పారు.
కొందరు పని గట్టుకొని తప్పుడు కథనాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఆర్డీఏలో మంత్రి నారాయణదే హవా అంటూ బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కాగా, రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు వేగవంతం చేస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తామన్నారు.












Click it and Unblock the Notifications