కాంగ్రెస్తో పొత్తుపై మంత్రి నారాయణ, చంద్రబాబు ఏం చెబితే అదే: చినరాజప్ప
అమరావతి: ఏపీకి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర అన్యాయం చేశాయని, అలాంటి పార్టీలతో తాము పొత్తు పెట్టుకునేది లేదని మంత్రి నారాయణ శుక్రవారం చెప్పారు. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కాంగ్రెస్ కేంద్రంలోకి అధికారంలోకి రావాలి కదా అన్నారు.
25 ఎంపీ స్థానాలు గెలవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడా కాంగ్రెస్తో కలసి వెళ్తామని చెప్పలేదని తెలిపారు. రాజధాని నిర్మాణంలో కాంట్రాక్టర్లకు 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సు ఇస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
గతంలోనూ ఇలాంటి అడ్వాన్సులు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని చెప్పారు. అమరావతి నిర్మాణం కోసం ఉపకరణాలు, నిర్మాణ సామగ్రి కోసం అడ్వాన్సు ఇచ్చినట్లు తెలిపారు. ఎక్కడా 15 శాతం ఇవ్వలేదని, నిబంధనలకు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందన్నారు. అమరావతి బాండ్లు రాజధాని నిర్మాణానికి అవసరమని, వీటి వల్ల కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పనులకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.
ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం
కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప శుక్రవారం స్పందించారు. తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమానదూరంలో ఉన్నామని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. భోగాపురం విమానాశ్రయంపై బీజేపీవి అసత్య ఆరోపణలు అన్నారు.
యనమల చికిత్సకు అంత ఖర్చా?
అమరావతి బాండ్ల పేరుతో తెలుగుదేశం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు అన్నారు. ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు పంటి చికిత్సకు రూ.3 లక్షలు ఖర్చు చేసారంటే ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుందో తెలుస్తోందన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పంచనే టీడీపీ నడుస్తోందన్నారు. రాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రం నిర్లక్ష్యం వల్లే పోర్టు ఏర్పాటు వెనక్కి పోతోందన్నారు. నిమ్జ్ ఏర్పాటుకు కూడా ఏపీ సర్కార్ నిర్లక్ష్యమే కారణం అన్నారు.