నాగార్జునలో అసభ్యంగా, రోజా కాకిగోల: టిడిపి, 'రిషికేశ్వరి కేసులో సంబంధంలేదు'
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు శుక్రవారం నాడు తప్పుబట్టారు. ఈ ఘటన పైన వైసిపి ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
గురువారం రోజా, ఇతర వైసీపీ ఎమ్మెల్యేల నేతృత్వంలోని వైసీపీ నిజనిర్ధారణ కమిటీ నాగార్జున వర్సిటీలో సందర్శించిన విషయం తెలిసిందే. దీనిపై పత్తిపాటి మాట్లాడారు.
ఘటన పైన వైసిపి ఎమ్మెల్యేలు... వివరాలు తెలుసుకోవడం, న్యాయం చేయమని డిమాండ్ చేయడం ఏమాత్రం తప్పు కాదన్నారు. అయితే, ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సరికాదన్నారు. వర్సిటీకి వారికి వెళ్లే హక్కు ఉందని, కానీ సిబ్బందిని తిట్టడం మాత్రం సరికాదన్నారు.
బీఆర్క్ విద్యార్థిని రిషికేశ్వరి ఆత్మహత్య ఘటన పైన విచారణ కమిటీ నివేదిక ఈ నెల 10వ తేదీన తమకు అందనుందని పత్తిపాటి చెప్పారు. ఈ ఘటనలో నిందితులుగా తేలినవారు ఎంతటి వారైనా వదిలే పెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
రిషికేశ్వరి కేసులో చరణ్, శ్రీనివాస్లకు సంబంధం లేదు: న్యాయవాది
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో బెయిల్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు జరిగియి. నిందితుల తరఫు న్యాయవాది మహతిశంకర్ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. చరణ్, శ్రీనివాస్లకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఘటన జరిగిన సమయంలో వర్సిటీలో వీరు ఇద్దరు లేరని, వర్సిటీలోని గ్రూపు తగాదాల వల్లే వీరిని కేసులో ఇరికించారని వాదించారు. సూసైడ్ నోట్లో రిషికేశ్వరి ఎవరి పేర్లను ప్రస్తావించకపోయినప్పటికీ ఊహాజనితంగా చరణ్, శ్రీనివాస్ పైన కేసు పెట్టడం సరికాదన్నారు.
రిషికేశ్వరి మృతి కేసులో ఈ ముగ్గురు నిందితులే కాకుండా మరికొందరి ప్రమేయం కూడా ఉందని వారిని కూడా విచారించాలని కూడా న్యాయమూర్తిని కోరారు. రిషికేశ్వరి తల్లిదండ్రుల లాయర్ వైకే తన వాదనలు వినిపిస్తూ.. నిందితులకు బెయిల్ ఇవ్వవద్దన్నారు.
అసభ్యంగా ప్రవర్తించారు: దేవినేని
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాగార్జున విశ్వవిద్యాలయానికి వెళ్లిన అంశంపై స్పందిస్తూ.. వైసీపీ నేతలు అక్కడకు వెళ్లి అసభ్యంగా ప్రవర్తించారని దేవినేని మండిపడ్డారు. ఈ ఘటనను జగన్ రాజకీయం చేస్తున్నారన్నారు.
శిక్ష తప్పదు: యరపతినేని
రిషికేశ్వరి మృతి కేసులో నిందితులు ఎంతటి వారైనా శిక్ష తప్పదని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ రావు అన్నారు. వర్సిటీని ప్రక్షాళన చేసి అత్యున్నతస్థాయి విద్యా ప్రమాణాలు కల్పిస్తామన్నారు. రోజా లాంటి వెయ్యిమంది వచ్చి కాకిగోల చేసినా నష్టం లేదన్నారు. కోర్టు పక్షులు వైసిపి నేతలు న్యాయం గురించి మాట్లడటం సిగ్గుచేటన్నారు.