కాపు రిజర్వేషన్లు: బాబుకు ఊహించని షాక్, మూడ్రోజుల్లో ఎదురు తిరిగిన మంత్రి పితాని! జగన్కు ఛాన్స్
Recommended Video
అమరావతి: కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళనపై మంత్రి, టీడీపీ నేత పితాని సత్యనారాయణ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన మాట్లాడారు.
ఇది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పత్రికా ప్రకటన చేశారు. బీసీ వర్గాల ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఊహించని షాకిచ్చారు.
జగన్ మహనీయుడు కానీ: ప్రశంసిస్తూనే మమత షాక్, పార్టీకి గుడ్బై, ఎందుకంటే?
బీసీ ప్రతినిధులతో ముందే చర్చిస్తే బాగుండేది
కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళనపై మంత్రి పితాని స్పందించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే ముందు గానీ ఆ తర్వాత గానీ బీసీ ప్రతినిధులతో తమ ప్రభుత్వం సంప్రదింపులు జరిపితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. వారితో చర్చలు జరిపి వారి ఆందోళనకు ఫుల్స్టాప్ పెడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికైనా సమస్య జఠిలం కాకుండా చూడాలి
బీసీ వర్గాల వాదనతో తాను ఏకీభవిస్తున్నానని పితాని సత్యనారాయణ అన్నారు. ఇప్పటికైనా సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. తద్వారా బీసీ ప్రతినిధులతో ఇప్పటికైనా చర్చించిసమస్య పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో ఆందోళన ఉందన్నారు.
మూడు రోజుల క్రితం ఏమన్నారంటే
కాపు రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు కూడా మంత్రి పితాని స్పందించారు. ఈ బిల్లు వల్ల బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఆయన స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లతో ఎలాంటి నష్టం లేదని చెప్పారు. ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పులు చేయలేదని వ్యాఖ్యానించారు. కాపు రిజర్వేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి నష్టం లేనప్పుడు దానిని స్వాగతించాలని సూచించారు.
మూడు రోజుల్లో మాట మార్చిన మంత్రి పితాని
మూడు రోజుల క్రితం అలా మాట్లాడిన మంత్రి పితాని అంతలోనే మాట మార్చడం గమనార్హం. ఆయన తాజా వ్యాఖ్యలు అధినేత చంద్రబాబును, టిడిపిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. కాపు రిజర్వేషన్లపై మంత్రి పితాని గళం ఎందుకు మారిందనే చర్చ సాగుతోంది.
బీసీ సంఘాలకు కూడా హితవు
తన మాటలతో ప్రభుత్వానికి షాకిచ్చిన మంత్రి పితాని సత్యనారాయణ బీసీ సంఘాలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు. బీసీ వర్గాలు ప్రతిపక్షం ఉచ్చులో పడవద్దని కోరారు. మీ మాటలతో ఏకీభవిస్తున్నానని చెబుతూనే వారికి సూచన చేశారు.
మాట మార్చడం వెనుక.. బీసీ సంఘాల ఒత్తిడి వల్లే
కాపు రిజర్వేషన్లపై మంత్రి పితాని సత్యనారాయణ మాట మార్చడం వెనుక బీసీ సంఘాల ఒత్తిడి ఉండి ఉండవచ్చునని చెబుతున్నారు. అందుకే ఆయన అలా మాట్లాడారని, అదే సమయంలో విపక్షాల ఉచ్చులో పడవద్దని బీసీ సంఘాలకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.
జగన్కు అవకాశం
ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి పరోక్షంగా మద్దతిస్తున్న వైసీపీ కూడా కాపు రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ తీర్మానం చేసిన అనంతరం స్పందించింది. కాపులకు పూర్తి న్యాయం చేయలేదని, అలాగే బీసీలను ఆందోళనకు గురి చేస్తున్నారంటూ వైసీపీ వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో పితాని చేసిన వ్యాఖ్యలు జగన్కు అవకాశం ఇచ్చినట్లుగానే ఉన్నాయి.