పవన్ కు ఫ్యాన్స్ ఉంటే, జగన్ కు సోల్జర్స్ - ఆడుకుంటారు, రోజా..!!
ఏపీలో ఇప్పుడు పవన్ వర్సస్ వైసీపీ రాజకీయం నడుస్తోంది. వారాహి యాత్ర వేళ పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పైన విమర్శలు కొనసాగిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ సమయంలోనే మంత్రి రోజా తాజాగా పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్ సినిమాల్లో చేసినట్లుగా రాజకీయాల్లో చేయటం కుదరదని మంత్రి వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాన్ సీఎం జగన్..వాలంటీర్ల వ్యవస్థ పైన కొద్ది రోజులుగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థపైన పోరాటం చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ ను ఏకవచనంతో పిలుస్తానంటూ.. పలు వ్యాఖ్యలు చేసారు. పవన్ వాలంటీర్ల పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. తాజాగా టీడీపీ వాలంటీర్ల వ్యవస్థ పైన తమ వైఖరి స్పష్టం చేసింది. వాలంటీర్లను రద్దు చేయమని పార్టీ ప్రకటించింది. వారి పని తీరులో కావాల్సిన మార్పులు చేస్తామని స్పష్టం చేసింది. పవన్ వాలంటీర్ల వ్యవస్థను ప్రశ్నిస్తూ..వ్యతిరేకంగా ఉన్న సమయంలో టీడీపీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమవుతోంది.

మంత్రి రోజా పవన్ పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతోంది. పవన్ సినిమాలో చేసినట్లుగా రాజకీయాల్లో చేస్తే ప్రజలు సహించరని చెప్పుకొచ్చారు. పవన్ మతి స్థిమితం లేని వ్యక్తి లాగా ప్రవర్తిస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. ఊగిపోతూ ఏది పడితే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తనకు తాను విప్లవకారుడిగా చెప్పుకొనే పవన్ ఏం విప్లవం చేసారని ప్రశ్నించారు. విప్లవకారులు ప్యాకేజీ కోసం పని చేయరని వ్యాఖ్యానించారు. పవన్ కు ఫ్యాన్స్ ఉంటే..జగన్ కు సోల్జర్స్ ఉన్నారని రోజా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల మద్దతుతో చంద్రబాబు, పవన్ ను ఆడుకొనేందుకు సిద్దమవుతున్నారని రోజా వ్యాఖ్యానించారు.

జనసేనకు పోటీకి అభ్యర్ధులు కూడా లేరని ఎద్దేవా చేసారు. పవన్ ఇది షూటింగ్ కాదు...రియాల్టీ అని గుర్తించాలని సూచించారు. కర్నూలు జిల్లా ముచ్చుమర్రిలో రూ 2.38 కోట్లతో ఇండోర్ స్టేడియం ను రోజా ప్రారంభించారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో క్రీడలు నిర్వహిస్తున్నామని రోజా వెల్లడించారు. జగనన్న సురక్ష పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ వస్తోందని..ప్రజలకు కావాల్సిన సర్టిఫికెట్లు అందిస్తున్నామని రోజా వివరించారు. పవన్ కల్యాణ్ తీరును ప్రజలు తిరస్కరిస్తున్నారని రోజా చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా 2024..జగన్ వన్స్ మోర్ అనటానికి సిద్దంగా ఉన్నారని రోజా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications