నీ జాగీరా, పులివెందులనా: జగన్ను ఏకిన మంత్రులు
హైదరాబాద్: ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, రావెల కిశోర్ బాబు తీవ్రంగా ధ్వజమెత్తారు. అసెంబ్లీ జగన్ జాగీరు కాదని, లోటస్పాండ్లోనో, పులివెందులలోనో వ్యవహరించినట్లు అసెంబ్లీలోనూ ఉంటానంటే కుదరదని ఏపీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, రావెల కిషోర్బాబు జగన్పై వ్యాఖ్యానించారు.
సోమవారం సచివాలయంలో వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రధాన పతిపక్షనేతగా హుందాగా వ్యవహరించడంలో జగన్ విఫలమయ్యారని మంత్రి రఘునాథరెడ్డి ఎద్దేవా చేశారు. వ్యవహారశైలిలో చంద్రబాబుకు, జగన్కి నక్కకీ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రాజకీయ హత్యలు చేసిన జగన్ తెలుగుదేశం హయాంలో హత్యలు పెరిగిపోయాయని ఆరోపించడం ఆయన చేసిన హత్యలను కప్పిపుచ్చుకునేందుకేనని మంత్రి ఘాటుగా విమర్శించారు.
స్పీకర్ని గౌరవించడం లేదు సరికదా ఆయన పైనే విమర్ళలు చేయడం పట్ల జగన్ స్వభావం ఏమిటో అర్థమవుతుందని మరో మంత్రి రావెల కిశోర్ బాబు వ్యాఖ్యానించారు. పదే పదే స్పీకర్ను బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతూ పులివెందుల రౌడీయిజం చేస్తే అసెంబ్లీలో సాగనివ్వబోమని టిడిపి శాసనసభ్యుడు బొండా ఉమామమహేశ్వర రావు అన్నారు.
స్వపక్ష ఎమ్మెల్యేల గొంతునొక్కి వన్ మ్యాన్ షో చూపిన ప్రతిపక్షనేత జగన్.. స్పీకర్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రభుత్వ విప్లు కూన రవికుఉమార్, యామిని బాల, మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు.