క్షిపణి, ఆత్మహుతి డ్రోన్ల తయారీ కేంద్రం.. ఆ జిల్లాలో ఏకంగా వెయ్యి కోట్ల పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, రక్షణ రంగ తయారీని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేలా ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. హైదరాబాద్ కేంద్రంగా రక్షణ, అంతరిక్ష రంగాలలో సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ 'అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్', ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. నెల్లూరు జిల్లాలో అత్యంత అధునాతన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు సంస్థ సిద్ధమైంది.
రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అనంత్ టెక్నాలజీస్
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అనంత్ టెక్నాలజీస్ మొత్తం రూ.1,000కోట్ల భారీ నిధులను వెచ్చించనుంది. ఈ మెగా యూనిట్ను రెండు విభిన్న దశల్లో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. మొదటి దశ ప్రారంభంలో రూ. 300 కోట్ల పెట్టుబడితో పనులను ప్రారంభిస్తారు. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన ప్రాథమిక విడిభాగాలు, పరికరాల అసెంబ్లింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. ఈ దశ ద్వారా దాదాపు 200 మందికి ఉపాధి లభించనుంది.

750 మందికి ప్రత్యక్షంగా ఉపాధి
తదుపరి విడతలో రూ. 700 కోట్ల వ్యయంతో ఈ యూనిట్ను మరింత విస్తరిస్తారు. దీని ద్వారా మరో 550 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మొత్తంగా ఈ ప్రాజెక్టు ద్వారా 750 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కనుంది. ఈ బృహత్తర పరిశ్రమ స్థాపనకు నెల్లూరు జిల్లా దుత్తలూరు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 300 ఎకరాల భూమిని గుర్తించింది.
మొదటి దశను 24 నెలల్లో, రెండో దశను 48 నెలల్లో పూర్తి చేసేలా లక్ష్యం
ప్రభుత్వ అనుమతులు లభించిన నాటి నుండి మొదటి దశను 24 నెలల్లో, రెండో దశను 48 నెలల్లో పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. పరిశ్రమ నిర్వహణకు రోజువారీ అవసరాల కోసం దాదాపు 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండిపాలెం రిజర్వాయర్ నుండి రోజుకు 75 కిలోలీటర్ల నీటిని కేటాయించాలని, అలాగే జాతీయ రహదారి (NH-565) నుండి ప్రాజెక్ట్ సైట్ వరకు మెరుగైన అప్రోచ్ రోడ్డును నిర్మించాలని అనంత్ టెక్నాలజీస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణుల భారీ ఉత్పత్తి
రక్షణ రంగ సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 'లోయిటరింగ్ మునిషన్స్' 'ఆత్మాహుతి డ్రోన్ల' తయారీపై ఈ సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. ఈ డ్రోన్లు క్షిపణి మరియు సాంప్రదాయ డ్రోన్ల కలయికగా శత్రు స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేయగలవు. రెండు దశలు పూర్తయ్యాక, ఏటా దాదాపు 4,000 ఆత్మాహుతి డ్రోన్లను ఉత్పత్తి చేయాలని సంస్థ భావిస్తోంది.
మొదటి దశలో ఏటా 150, రెండో దశలో ఏటా 550 క్షిపణులను రీఫర్బిష్
దీనితో పాటు, క్షిపణుల రీఫర్బిష్మెంట్ ప్రక్రియను కూడా ఇక్కడ చేపట్టనున్నారు. మొదటి దశలో ఏటా 150, రెండో దశలో ఏటా 550 క్షిపణులను రీఫర్బిష్ చేయనున్నారు. అలాగే, రెండో దశలో ఏటా కొత్తగా 1,100 క్షిపణుల అనుసంధానం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా హై-ఎనర్జీ మెటీరియల్స్, అధునాతన మందుగుండు సామగ్రి తయారీలో ఆంధ్రప్రదేశ్ ఒక ప్రముఖ హబ్గా మారే అవకాశం ఉంది.
డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్' ఏర్పాటుకు ఇది ఒక చుక్కాని పరిశ్రమ
రాష్ట్రంలో 'డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్' ఏర్పాటుకు ఇది ఒక చుక్కాని పరిశ్రమగా నిలుస్తుందని, దేశ అంతరిక్ష, రక్షణ రంగాల సప్లై చైన్ను ఇది మరింత బలోపేతం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.ఏది ఏమైనా ఏపీలో కూటమి ప్రభుత్వం పరిశ్రమల స్థాపన విషయంలో పెట్టుబడిదారులకు బాసటగా నిలుస్తూ ఏపీ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది.













Click it and Unblock the Notifications