'నాకు తెలియకుండా ఏది జరగవద్దు': రహస్య భేటీలపై బాలయ్య వార్నింగ్
పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది, ఇది టీడీపీ కుటుంబం, ఎవరూ నా అనుమతి లేకుండా, నా ఇష్టానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించరాదు'
హిందూపురం: సినిమాలు-రాజకీయాలు.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్న క్రమంలో.. హిందూపురం నియోజకవర్గంపై ఎమ్మెల్యే బాలకృష్ణ అంతగా దృష్టి పెట్టట్లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
దీనికి తోడు ఆయన పీఏ చంద్రశేఖర్ నియోజకర్గంలో పెత్తనం చెలాయించాలని చూడటం.. అవినీతి మరకలతో పార్టీకే చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించడం.. హిందూపురంలో కలకలం రేపుతున్నాయి. శేఖర్ ఆగడాలను జీర్ణించుకోలేని కొంతమంది పార్టీ పెద్దలు.. నియోజకవర్గంలో కొన్ని రహస్య సమావేశాలు నిర్వహించారు.
బాలకృష్ణ 'పీఏ'ని తరిమేద్దాం: తమ్ముళ్ల ఆగ్రహం, రంగంలోకి లోకేష్
కొన్నాళ్లుగా పార్టీలో తటస్థంగా ఉంటూ వస్తున్న మాజీ ఎమ్మెల్యే సీసీ వెంకటరాముడు, నాయకులు అంబికా లక్ష్మీనారాయణలు ఈ సమావేశాలకు ప్రాతినిథ్యం వహించడం.. అసలు నియోజకవర్గంలో ఏం జరగబోతుంది? అన్న చర్చను లేవనెత్తింది.
ఆఖరికి ఈ రహస్య సమావేశాల విషయం కాస్తం టీడీపీ అధిష్టానానికి చేరడంతో.. నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇప్పటిదాకా దీనిపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించలేదు. కానీ ఆయన తరుపున రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ రంగనాయకులు స్పందించారు.
శుక్రవారం నాడు హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్ద నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. 'పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురం టీడీపీకి కంచుకోటగా ఉంది, ఇది టీడీపీ కుటుంబం, ఎవరూ నా అనుమతి లేకుండా, నా ఇష్టానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించరాదు' అని బాలయ్య చెప్పినట్టుగా రంగనాయకులు తెలిపారు.
ఇది బాలయ్య చెబుతోన్న మాటగా.. పార్టీ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యలుంటే ఎమ్మెల్యేతోనే నేరుగా చర్చించుకుందామని రంగనాయకులు కార్యకర్తలను కోరారు. పీఏపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఆయనపై తుది నిర్ణయం బాలయ్యదే అన్నారు.
కాగా, బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు రాష్ట్ర సరిహద్దులోని కొడికొండ చెక్పోస్టు వద్ద టీడీపీ కీలక నేతలు భేటీ అయ్యారు. చిలమత్తూరులో ఈ నెల 5న సభ నిర్వహించుకునేందుకు వారు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనిపై స్పందించిన రంగనాయకులు.. ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోను సభ నిర్వహించరాదని హెచ్చరించారు.