రాజకీయాల్లోకి మోహన్ బాబు రీ ఎంట్రీ: ఏ పార్టీ?
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నాడు. తన జన్మదినం సందర్భంగా ఓ ప్రముఖ తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఈ విషయం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరేది ఆయన వెల్లడించలేదు.
ఏ పార్టీలో చేరేది తర్వాత చెబుతానని మోహన్ బాబు చెప్పారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేవారు. టిడిపి నుంచి ఆయన రాజ్యసభకు కూడా వెళ్లారు. అయితే, ఆ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వర్తమాన రాజకీయాలపై కూడా తన అభిప్రాయాలను వెల్లడించారు.
మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంతో భేటీ కావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై కూడా ఆయన స్పందించారు. ముద్రగడ పద్మనాభం తమకు చిరకాల మిత్రుడని, విష్ణు ఆ దగ్గరలో ఓ పెళ్లుంటే వెళ్లాడని, తన సూచన మేరకు ఆయనను పరామర్శించి వచ్చాడని, ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు.
మోహన్ బాబు తెలంగాణలో కాకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కీలక భూమిక పోషించే అవకాశాలున్నాయి. ఆయన చిత్తూరు జిల్లాలో విద్యానికేతన్ విద్యాసంస్థను నడిపిస్తున్నారు. అది త్వరలో యూనివర్శిటిగా మారే అవకాశం కూడా ఉంది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మోహన్ బాబు బంధువు అవుతారు. అయితే, ఆ కారణంగా ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారా అనేది కచ్చితంగా చెప్పే విషయం కాదు. టిడిపిలో చేరే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేది కూడా చెప్పడం సాధ్యం కాదు. ఏమైనా, ఆయన తిరిగి రాజకీయాల్లోకి వచ్చే వరకు అది సస్పెన్స్గానే ఉండే అవకాసం ఉంది.