రుతుపవనాల రాక: రానున్న రెండు మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు, ఉరుములుమెరుపులు
హైదరాబాద్: నైరుతి రుతుపవనాల కదలికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతంతోపాటు దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
నైరుతి రుతుపవనాలు రానున్న 48 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మొత్తం మాల్దీవులు, లక్షద్వీప్లోని పరిసర ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాలపై ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో నైరుతి రుతుపవనాలు బలపడి కేరళ, తమిళనాడు, లక్షద్వీప్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే రానున్న రెండురోజులపాటు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను ప్రకటించారు. ఉత్తర కోస్తా, యానంలలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒకటి రెండు చోట్ల పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది.
దక్షిణ కోస్తాలో గురువారం నుంచి మూడు రోజులపాటు మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేగాక, పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.