ఖబడ్దార్: కెసిఆర్పై మోత్కుపల్లి, అశోక్ బాబెవరని దానం
కెసిఆర్ దొంగ నిరాహార దీక్ష చేశారని మోత్కుపల్లి, ఎర్రబెల్లి మండిపడ్డారు. ఆయన తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారో చెప్పాలన్నారు. టిడిపి బాబ్లీ కోసం పోరాడుతుంటే కెసిఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. బయ్యారం గనుల్లో కెసిఆర్కు ముడుపులు అందాయని ఆరోపించారు. కెసిఆర్తో తాము ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు.
బీడి కట్టల పైన పుర్రె గుర్తుకు కెసిఆరే కారణమన్నారు. తెలంగాణ భూములను వైయస్ రాజశేఖర రెడ్డి కొల్లగొడుతుంటే పెదవి విప్పలేదన్నారు. శీతాకాల సమావేశాల్లో బిల్లు రాదని తేలిపోయిందన్నారు. కెసిఆర్, సోనియా గాంధీలు కలిసి తెలంగాణను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబును కెసిఆర్ పొగిడిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
జెసి, అశోక్ బాబులపై దానం
రాష్ట్రానికి వచ్చిన ఎపి కాంగ్రెసు వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను దానం నాగేందర్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన జెసి దివాకర్ రెడ్డి, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు పైన నిప్పులు చెరిగారు. అశోక్ బాబు మితిమీరి మాట్లాడుతున్నారని, సోనియా ఫ్లెక్సీలు కాల్చడం, తమ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. తాము ఇప్పటి వరకు ప్రేక్షక పాత్ర పోషించామని, ఇక నుండి హైదరాబాదులో దిష్టిబొమ్మలు కాలిస్తే ఖబర్డార్ అంటూ అశోక్ బాబును హెచ్చరించారు.
డిగ్గీని గో బ్యాక్ అనేందుకు అశోక్ బాబు, ఎపిఎన్జీవోలు ఎవరన్నారు. అశోక్ బాబు వెనుక ఏ బాబు ఉన్నా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. హైదరాబాదు పైన అందరికీ హక్కుంటుందని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. సోనియా పైన జెసి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి ఇప్పుడు సోనియాను తప్పుకోవాలని చెప్పడమేమిటన్నారు. విభజన బిల్లు వచ్చాక ఇంకా సమైక్యవాదం అనవసరమన్నారు. హైదరాబాదుపై ఆంక్షలు సవరించాలని అసెంబ్లీలో కోరుతామన్నారు.