ఎన్నికల్లో పోటీ పై తేల్చేసిన ఎంపీ కేశినేని నాని, టీడీపీ నుంచి కాదు..!!
టీడీపీ ఎంపీ కేశినేని నాని తేల్చేసారు. పార్టీ హైకమాండ్ ను డోన్ట్ కేర్ అంటున్నారు. కొద్ది రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలను ఎంపీ ప్రశంసిస్తున్నారు. ఇది టీడీపీ నేతలకు రుచించటం లేదు. వైసీపీ నేతలు కేశినేని పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కీలక ప్రకటన చేసారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని వస్తే వైసీపీలోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేసారు. నాని మంచి మనిషని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేశినేని నాని తన మనసులో మాట బయట పెట్టారు.
కేశినేని అల్టిమేటం : కేశినేని టీడీపీ నాయకత్వానికి అల్టిమేటం ఇచ్చారు. సోదరుడు చిన్నికి మద్దతుగా టీడీపీలోని కొందరు నేతలు మద్దతుగా నిలుస్తూ తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని కేశినేని నాని ఆగ్రహంతో ఉన్నారు. వరుసగా వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కొద్ది రోజుల క్రితం నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ తో కలిసిన పాల్గొన్న కార్యక్రమాల్లో ఆయన్ను అభినందించారు .

దీని పైన నందిగామ టీడీపీ నేతలు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో నాని వ్యతిరేక పోస్టులు కనిపించాయి. ఈ రోజు మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ తో కలిసి కార్యక్రమాలకు హాజరైన సమయంలో చేసిన వ్యాఖ్యలతో టీడీపీతో ఇక తాడో పేడే తేల్చుకోవటానికి సిద్దమైనట్లు స్పష్టం అవుతోంది.
వైసీపీ నుంచి ఆహ్వానం : వచ్చే ఎన్నికల్లో సీటు పైన కేశినేని నాని స్పందించారు. ఎన్నికల్లో ఏ పిట్టల దొరకు సీటు ఇచ్చినా తనకు ఇబ్బంది లేదన్నారు. తాను ప్రజలు కోరుకుంటే స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేయటానికి సిద్దమని కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ నుంచి ఆహ్వానం వస్తున్న సమయంతో తన మనస్తత్వానికి సరిపోయే పార్టీ అయితే ఓకే అంటూ చెప్పుకొచ్చారు. తనకు పార్టీ టికెట్ ఇస్తుందా లేదా అనేదే సమస్య కాదన్నారు.
తనకు ఎంపీ అవుతానా లేదా అనే భయం లేదని నాని స్పష్టం చేసారు. ఎంపీగా తనకుకు మంచి ట్రాక్ రికార్డు ఉందని స్పష్టం చేసారు. ఎంపీగా తాను చేసినన్ని పనులు ఏ ఎంపీ చేయలేదని వివరించారు. తన మాటలను పార్టీ ఎలా తీసుకున్నా భయం లేదని తేల్చి చెప్పారు. దీని ద్వారా కేశినేని నాని అవసరమైతే టీడీపీతో ఎటువంటి నిర్ణయానికి అయినా సిద్దపడ్డారనేది స్పష్టం అవుతోంది.

నాని డిసైడ్ అయిపోయారా : వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేశినేని నాని సోదరుడు చిన్నికి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. రెండో సారి ఎంపీగా గెలిచిన సమయం నుంచి పార్టీలోని జిల్లాకు చెందిన కొందరు నేతల తీరు పైన కేశినేని నాని సీరియస్ గా ఉన్నారు. పలు సందర్భాల్లో పార్టీ అధినాయకత్వం వద్ద తన అభిప్రాయాలను స్పష్టం చేసారు.
కేశినేని నాని వ్యవహారం కుటుం సమస్యలుగా భావిస్తూ వచ్చింది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వ్యవహారం ముదిరింది. వచ్చే ఎన్నికల్లో నాని టీడీపీ నుంచి పోటీ చేరనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాలు..ప్రశంసలు..విజయవాడ కోసం ఎవరితోనైనా కలుస్తానని చెప్పటంతో కేశినేని నాని పక్కా ప్లాన్ తో వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications