టీడీపీలోకి లావు సహా పల్నాడు వైసీపీ నేతలు - ఎంపీ నియోజకవర్గం ఖరారు..!!
ఎన్నికల వేళ పార్టీల మార్పు ఊపందుకుంది. ఇప్పటికే వైసీపీ నుంచి ఎంపీలు బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, పలువురు ఎమ్మెల్యేలు పార్టీ వీడారు. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ కేశినేని నాని రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇక, వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో సహా పల్నాడు వైసీపీ ముఖ్య నేతలు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు పోటీ చేసే స్థానం పైన పార్టీ నుంచి హామీ వచ్చింది.
టీడీపీలోకి ఎంట్రీ : వైసీపీలో సీట్ల మార్పు వ్యవహారంతో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీని వీడారు. నర్సరావుపేట పార్లమెంటరీ పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెడ్డి, కమ్మ, కాపు వర్గాల అభ్యర్దులే బరిలో ఉండటంతో, ఎంపీ సీటు బీసీ వర్గానికి ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచన. అందులో భాగంగా లావు శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీ చేయాలని ప్రతిపాదించారు. అందుకు లావు ససేమిరా అన్నారు. అదే సమయంలో పల్నాడు ప్రాంత ఎమ్మెల్యేలు సైతం సీఎం జగన్ ను కలిసి లావు శ్రీకృష్ణదేవరాయలును నర్సరావుపేటలోనే కొనసాగించాలని కోరారు. దీని పైన సీఎం జగన్ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ సమయంలోనే లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసారు. టీడీపీలో చేరేందుకు నిర్ణయించారు.

ఎంపీ సీటు హామీ : అదే విధంగా గురజాల సీటు ఆశించిన ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి సైతం పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే తన అనుచర వర్గానికి సమాచారం ఇచ్చారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు కూడా టీడీపీలో చేరుతారని తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు ఈ నెల 28న పొన్నూరులో చంద్రబాబు పాల్గొనే సభలో టీడీపీలో చేరాలని నిర్ణయించినట్లు సమాచారం. లావు శ్రీకృష్ణదేవరాయలుకు టీడీపీ నుంచి తిరిగి నర్సరావుపేట సీటు ఖాయం చేసినట్లు చెబుతున్నారు. తాను అక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పటంతో చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. నర్సారావు పేట పార్లమెంటరీ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రం టీడీపీ నుంచి ఈ సారి కొన్ని మార్పులు ఖాయమని పార్టీలో చర్చ సాగుతోంది.

హోరా హోరీ : జంగా కృష్ణమూర్తి కి సీటు పైన ఎటువంటి హామీ దక్కలేదని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే ప్రాధాన్యత ఇస్తామని మాత్రం చెప్పారని సమాచారం. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా..మండలిలో పార్టీ విప్ గా ఉన్నారు. గతంలో టీటీడీ ఛైర్మన్ పదవి ఆశించారు. చివరి మినిషంలో భూమనకు కేటాయించటంతో జంగా మనస్థాపానికి గురయ్యారు. గురజాల సీటు కోసం కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గురజాల సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ కు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో, జంగా పార్టీ వీడటం ఖాయమైందని అనుచరవర్గం స్పష్టం చేస్తోంది. ఇక.. ఇప్పుడు నర్సరావు పేట నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్దిగా బీసీ వర్గానికి చెందిన వారికి కేటాయిస్తారని చెబుతున్నారు. దీంతో..అధికారికంగా టీడీపీ, వైసీపీ ఎంపీ అభ్యర్దులుగా ఎవరు పోటీకి దిగుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications