ఎవరో కన్నబిడ్డకు, ఇంకేవరో బర్త్ డే చేసినంత చంఢాలంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం: సాయిరెడ్డి
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవం ఎవరో కన్నబిడ్డకు ఇంకెవరో బర్త్ డే సెలబ్రేట్ చేస్తున్న దరిద్రంగా ఉందని విజయ సాయి రెడ్డి విమర్శించారు.
టీడీపీ ఎన్టీఆర్ నుండి దొంగతనంగా గుంజుకున్న పార్టీ: సాయిరెడ్డి
ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి చంద్రబాబు ఆవిర్భావ దినోత్సవం చేయడంపై మండిపడిన విజయ సాయి రెడ్డి టిడిపి చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని, ఎన్టీఆర్ నుండి దొంగతనంగా గుంజుకున్న పార్టీ అని ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తుందో అంటూ విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి అంతకుముందే టీడీపీ 40 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 40 ఏళ్ళ పాటు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ మండిపడ్డారు.
ఆవిర్భావ దినోత్సవాల్లో తుప్పు, పప్పు నాయుళ్ళను స్తుతిస్తున్నారంటే టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో
ఇదే సమయంలో ఒకరేమో...మీరు స్టార్ట్ అనండి చాలు, మేం యాక్షన్ చేసి మిమ్మల్ని సీఎం చేస్తామంటారు. మరొకరు నేను-తెలుగుదేశం అంటూ పుస్తకం రాసి అంతా మా బాబే అంటారు. పుస్తకావిష్కరణను ఒక కులసభగా మార్చేశారు అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఆవిర్భావ దినోత్సవాల్లో తుప్పు, పప్పు నాయుళ్ళను స్తుతిస్తున్నారంటే టీడీపీ ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
టీడీపీలో అసమర్ధులకు, చెంచాలకు పెద్దపీట
టిడిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు తమ్ముళ్లు పరస్పరం దాడులు చేసుకుంటూ తన్నుకు చస్తున్నారని, అసమర్థులకు, చెంచాలకు తండ్రి కొడుకులు పెద్దపీట వేస్తున్నారని, మొదటి నుంచి పార్టీ జెండా మోసిన కార్యకర్తలు రగిలిపోతున్నారు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి వారి వెంటబడి తరుమకుండా చూసుకోవాలని హితవు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరోమారు ఎన్టీఆర్ నుండి టిడిపి దొంగతనంగా దోచుకున్న పార్టీ అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.
Recommended Video
తెలుగు తమ్ముళ్ళ కబ్జాల నుండి విశాఖకు విముక్తి
అంతేకాదు అక్రమార్కులైన తెలుగు తమ్ముళ్ల కబ్జాల నుంచి విశాఖకు విముక్తి లభిస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. మూడేళ్ళలో 5 వేల కోట్ల విలువైన 431 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని విజయ సాయి రెడ్డి స్పష్టం చేశారు. కాళ్ళ కింద భూమి కదిలిపోవడంతో కుల పచ్చాసురులు కకావికలమవుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.