బాబూ!..నారా లోకేష్ ను అరెస్ట్ చేస్తే...స్టే తెచ్చుకోవద్దు: ముద్రగడ లేఖ
తూర్పుగోదావరి జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాస్త్రం సంధించారు. ఈ సందర్భంగా ముద్రగడ తాను రాసిన లేఖలో చంద్రబాబును,లోకేష్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్య కాలంలో గుమ్మడికాయల దొంగ ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారని చంద్రబాబుకు రాసిన లేఖలో ముద్రగడ ప్రశ్నించారు. మీరు నిప్పు కదా...నిప్పుకు భయం ఉంటుందా అని ఎద్దేవా చేశారు. మీరు ఏ ఘనకార్యం చేశారని ప్రజలు మీ వెనుక ఉండాలని కోరుకుంటున్నారు...మీ వెనకాలే ఉంటే మీరు చేసినట్లే వారిని అక్రమ కేసులు, ఉక్కుపాదాలతో అణచిచేస్తే అమాయక ప్రజలకు దిక్కెవరని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు.
మీ కుమారుడిపై ఆరోపణల నేపథ్యంలో అతడిపై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని ఎందుకు సవాల్ చేయలేకపోతున్నారని ముద్రగడ ప్రశ్నించారు. సీబీఐ విచారణ కోసం మీరు కేంద్రానికి సవాలు విసరకపోతే చరిత్రహీనులు కావడం తధ్యమన్నారు. "ఒకవేళ మిమ్మల్ని, మీ కుమారుడు నారా లోకేష్ని అరెస్టు చేస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవద్దని నా సలహా" అని ముద్రగడ తన లేఖలో పేర్కొనడం కలకలం సృష్టిస్తోంది.
ఐదు రోజుల క్రితం ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి రాసిన లేఖలో ముందస్తు ఎన్నికలు రాకపోతే మీ పదవి ముగిసిన అధ్యాయం లాంటిదంటూ ముద్రగడ పేర్కొన్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లపాటు ఎపి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు ఎన్నికల భయంతో ప్రస్తుతం యూటర్న్ తీసుకుని ప్రత్యేక హోదా పేరుతో నాటకాలాడుతున్నారంటూ మండిపడిన ముద్రగడ కొద్ది రోజుల వ్యవధిలోనే వరుస లేఖలు సంధించడం చర్చనీయాంశంగా మారింది.