చంద్రబాబుపై ముద్రగడ 'కాపు' ఫైట్: వెనుక జగన్, దాసరి చెవిలో వేశారు!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం దర్శకరత్న దాసరి నారాయణ రావును కలవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. కాపు సామాజిక వర్గాన్ని తనవైపుకు తిప్పుకునే ఉద్దేశ్యంలో భాగంగానే దాసరిని జగన్ కలిశాడంటున్నారు.
దాసరితో భేటీ సందర్భంగా జగన్ పలు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. దాసరిని పార్టీలోకి ఆహ్వానించగా.. ఆయన సమయం కోరారని కూడా వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ప్రధానంగా కాపు అంశం వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కాపుల రిజర్వేషన్ కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంతకుముందు వైసిపితో కలిసే పని చేశారని, ఇప్పుడు ఆయన చేస్తున్న ఉద్యమానికి పార్టీ మద్దతు పలుకుతుందని దాసరి నారాయణ రావుతో జగన్ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోందంటున్నారు.
కాపులను బిసిల్లో చేర్చుతామని సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినందున ఇచ్చిన హామీ మేరకు కాపులను బిసిల్లో చేర్చాలని కాపు సంఘాలు, కాపు నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నిత్యం ముఖ్యమంత్రి చంద్రబాబు పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఆయన టిడిపిని ప్రతి నిత్యం లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడుతున్నారు. కాపులకు ఇచ్చిన బీసీ హామీని నెరవేర్చాలంటూ ఆయన ఉద్యమమే చేస్తున్నారు.
అయితే, ప్రస్తుతం ఆయన పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఇంతకు ముందు ఆయన వైసిపితో కలిసి పని చేశారు. ఆ తర్వాత కాపులను బిసిల్లో చేర్పించాలని పోరాడుతున్నారు. ఇప్పుడు దాసరితో భేటీలో జగన్ మాట్లాడుతూ.. ముద్రగడ ఉద్యమానికి తమ మద్దతు ఉందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.