దీక్ష విరమణకు ముద్రగడ షరతులివే!: దాసరిపై పోలీసుల అయోమయం
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం నాడు దీక్షను విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ దఫా తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులు ముద్రగడతో ఆదివారం చర్చించారు. ఈ చర్చల్లోనే ముద్రగడ దీక్ష విరమణకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది.
సోమవారం మధ్యాహ్నం మంత్రి అచ్చెన్నాయుడు, టిడిపి ఏపీ చీఫ్ కళా వెంకట్రావులు ముద్రగడతో చర్చలు జరుపనున్నారు. ఆ తర్వాత ముద్రగడ దీక్ష విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్న రాత్రి చర్చల్లోనే ముద్రగడ విషయమై స్పష్టత వచ్చిందని, ఇప్పుడు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావులు మరోసారి చర్చించి, ఆయనతో దీక్ష విరమింప చేస్తారని అంటున్నారు.
ఆదివారం రాత్రి చర్చలో... ముద్రగడ ప్రభుత్వం ముందు పలు షరతులు పెట్టారని తెలుస్తోంది. తుని ఘటన కేసు ఎత్తివేత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లో ముద్రగడ చెప్పిన వారికి ఒక్కరికి స్థానం, మరో ఏడున్నర నెలల్లో కమిషన్ నివేదిక, కాపులకు రూ.వెయ్యి కోట్ల విషయమై షరతులు పెట్టారని తెలుస్తోంది.
దాసరి గృహ నిర్బంధం
రాజమండ్రిలో దర్శకరత్న దాసరి నారాయణ రావు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు రాజమండ్రి చేరుకున్న దాసరి ఓ హోటల్లో బస చేశారు. హోటల్ చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.
కిర్లంపూడికి దాసరి చేరుకుంటే కొంత ఉద్రిక్తత తలెత్తవచ్చని పోలీసులు భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాసరి హోటల్ బయటకు వస్తే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, అంతకుముందు కృష్ణా జిల్లాలో పోలీసులు అతనిని అడ్డుకున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాగా, కిర్లంపూడికి వెళ్లే మార్గంలో తమను అడ్డుకోవద్దని దాసరి తదితరులు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దాసరిని అరెస్ట్ చేయాలని గానీ, కిర్లంపూడికి వెళ్లనివ్వాలని గానీ పోలీసు వర్గాలకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేకపోవడంతో వారు అయోమయంలో ఉన్నారు.