మీరూ నన్ను కొన్నారా? రాష్ట్రం నీ జాగీరా: బాబు పాదాలు కడుగుతానన్న ముద్రగడ
కిర్లంపూడి: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సోమవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనను ఎవరో కొన్నారని, ఎవరికో అమ్ముడుపోయాని చంద్రబాబు చెబుతున్నారని, గతంలో కాంగ్రెస్ వ్యతిరేక ఉద్యమాల సమయంలో నన్ను మీరు ఎంతకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
గతంలో నన్ను మీరు కొన్నది నిజమే అయితే ఇప్పుడు నేను అమ్ముడు పోయింది కూడా నిజమే అన్నారు. కాపులకు ఇచ్చేందుకు బడ్జెట్ లేదని చెబుతున్న ప్రభుత్వం.. రాజధాని అమరావతి శంకుస్థాపనకు వందల కోట్లు ఎలా ఖర్చు చేసిందని ప్రశ్నించారు.
'తుని ఘటనలో జగన్ హస్తం': ఎప్పుడేం జరిగింది (పిక్చర్స్)
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో తిరిగేందుకు డబ్బు ఎక్కడిదని నిలదీశారు. తాత్కాలిక పట్టిసీమకు ఖర్చు ఎందుకన్నారు. తాను, తన జాతి ఎవరికీ అమ్ముడు పోదని చెప్పారు. నాలుగు రోజుల్లో నిరాహార దీక్ష చేస్తానని చెప్పారు.
తనకు సంఘీభావం తెలిపేందుకు ఎవరు కూడా కిర్లంపూడికి రావొద్దన్నారు. ఎవరి ఇళ్ల వద్ద వారే దీక్ష చేయాలని, తద్వారా సంఘీభావం తెలపాలన్నారు. నిన్న (ఆదివారం) మీడియా, పోలీసుల పైన దాడికి తాను క్ిషమాపణలు చెబుతున్నానని చెప్పారు.
ఉద్యమం ఏదో మేం చేసుకుంటుంటే మా పైన కొంత మీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. నిన్నటి ఘటనలో మా కార్లు కూడా తగలబడ్డాయన్నారు. ఈ రాష్ట్రంలో మేం బతకకూడదా, మేం అంతరించి పోవాలా.. అందుకే ఈ ఉద్యమం ప్రారంభించామన్నారు.
కాపు గర్జన కోసం తమకు ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదని, వచ్చిన వారికి భోజనాలు పెట్టనివ్వలేదని ఆరోపించారు. తన జాతికి న్యాయం జరిగే వరకు తన పోరు ఆగదని చెప్పారు. సామాన్యుల పైన కేసులు పెట్టవద్దన్నారు. తాము ఇతరుల కులాలను తగ్గించి రిజర్వేషన్లు అడగడం లేదన్నారు.
దీనిని కులాల మధ్య తగవుగా ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. తాను, తన భార్య దీక్షకు దిగుతామని, తమను అరెస్టు చేసినా ఎవరూ ఆవేశాలకు లోను కావొద్దని, శాంతియుతంగా నిరసనలు చేయాలన్నారు. గాంధేయ మార్గంలో ఉద్యమం చేద్దామన్నారు.
విజయ భాస్కర రెడ్డి తెచ్చిన జీవోను అవహేళన చేయడం సరికాదని, పోనీ మీరైనా సరైన జీవో ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారు. అప్పుడు మా జాతి మీ పాదాలను కడుగుతుందన్నారు. చంద్రబాబు బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. బాబు హామీ ఇచ్చారని, మా కాపు జాతి ఆయనకు ఓటు వేసిందన్నారు.
ఈ రాష్ట్రం చంద్రబాబు జాగీరా లేక ఎస్టేటా అని నిలదీశారు. కాపులకు రిజర్వేషన్లు ఈనాడు తెరపైకి వచ్చిన అంశం కాదని, ఏళ్ల తరబడి ఈ డిమాండ్ ఉన్నదేనని ఆయన తెలిపారు. కాపులను రౌడీలుగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదన్నారు.
తమ ఆకలి బాధను తీర్చమని మాత్రమే ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఉద్యమాన్ని ఆఖరి పోరాటంగా ఎంచుకున్నానని ఆయన ప్రకటించారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా ఉధ్యమాన్ని మాత్రం కొనసాగిస్తానని ముద్రగడ ప్రకటించారు. ఉద్యమాన్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని చెప్పడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.