ఏ పార్టీలో చేరను, నేనూ జైలుకు వెళ్తా: బాబుకు మళ్లీ ముద్రగడ హెచ్చరిక
కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో పది రోజుల క్రితం జరిగిన విధ్వంసకాండలో విచారణ చేయకుండా కేసులు నమోదు చేస్తే తాను ఊరుకునేది లేదని చెప్పారు.
తుని కేసు విషయంలో అమాయకులను జైలుకు పంపిస్తే తాను కూడా జైలుకు వెళ్తానని చెప్పారు. తన ఉద్యమానికి సహకరించిన వారందరిక ఆయన బుధవారం నాడు ధన్యావాదాలు తెలిపారు. కాపులకు రిజర్వేషన్ విషయమై కమిషన్ వేశామని ప్రభుత్వం తనకు హామీ ఇచ్చిందన్నారు.
అలాగే, ఏడు నెలల కాలంలోనే కమిషన్ నివేదిక ఇస్తుందని తనకు ప్రభుత్వం మాట ఇచ్చిందని చెప్పారు. కాలపరిమితి కంటే ముందే నివేదిక వస్తుందని చెప్పిందన్నారు. ఈ ఏడు నెలల కాలంలో హామీని నెరవేర్చకుంటే తాను మళ్లీ ఉద్యమం బాట పడతానని చెప్పారు.
తాను ఏ రాజకీయ పార్టీలోను చేరనని చెప్పారు. తనకు ఎలాంటి పదవులు వద్దని చెప్పారు. కాపుల కోసం నిధులు మంజూరు చేస్తామని చెప్పారని ముద్రగడ అన్నారు. తనకు పలు హామీలు ఇచ్చినందువల్లే దీక్ష విరమించానని, వాటిని నెరవేర్చకుంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై చంద్రబాబు హామీ నిలబెట్టుకోవాలని, మరోసారి రోడ్డెక్కే పరిస్థితి తేవద్దన్నారు.