మున్సి'పోల్': ఈవిఎం ధ్వంసం, రోజాVsకాంగ్రెస్

కృష్ణా జిల్లా నందిగామ మున్సిపాలిటీ ఎదుట ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర రావు ఆందోళనకు దిగారు. ఎన్నికల నేపథ్యంలో ఏజెంట్ పాస్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆయన బైఠాయించారు.
అనంతపురం జిల్లా మడకశిరలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికలకు ఓటర్లను వాహనాల్లో తరలిస్తున్నారంటూ అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప జిల్లా బద్వేలులో మున్సిపల్ ఎన్నికలు రసాబాసగా మారాయి. స్వతంత్ర అభ్యర్థి రమేష్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఇళ్లపట్టాలు ఇచ్చారని టిడిపి నేతలు ఆరోపించడంతో రెండో వార్డులోని ఎన్నికలు రసాబాసగా మారాయి. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నేతలు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఎన్నికలు బహిష్కరించారు. పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉదయం ఉద్రిక్తత తలెత్తింది. తమ పార్టీ ఏజెంట్లకు గుర్తింపు పత్రాలు ఇవ్వలేదని కందుల నారాయణ రెడ్డి మున్సిపల్ కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో టిడిపి, జగన్ పార్టీ ఏజెంట్లకు మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల పార్టీల మధ్య ఉద్రిక్తత తలెత్తింది.
ఐదు గంటల వరకే
సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రధానాధికారి రమాకాంత్ రెడ్డి హైదరాబాదులో చెప్పారు. ఐదు గంటలలోగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి నిల్చున్న వారికి స్లిప్పులు అందిస్తామని, వారు ఓటు వేయవచ్చునన్నారు. లిస్టులో పేరు లేకుంటే ఓటు వేసేందుకు అవకాశం ఉండదని చెప్పారు.
విజయవాడ కృష్ణలంక ఘటనపై రమాకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు కార్డులో ఏ ఒక్కటి ఉన్నా అనుమతి ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. కృష్ణలంకలోని పోలింగ్ కేంద్రంలో స్లిప్పులు లేవని వందమంది ఓటర్లకు పోలింగ్ సిబ్బంది అనుమత నిరాకరించాడు. దీనిపై ఆయన మండిపడ్డారు.
మాచర్లలో ఈవిఎం ధ్వంసం
గుంటూరులో మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మాచర్లలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తన అనుచరులతో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ... ఆయన బాబాయి పిన్నెల్లి లక్ష్మా రెడ్డి అడ్డుకున్నారు. దీనిపై పోలింగ్ సిబ్బందిని నిలదీసి, ఈ ఘటనలో ఈవిఎం ధ్వంసమైంది. ఇరువర్గాల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. 144వ సెక్షన్ విధించారు.
చిత్తూరులో...
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాల్టీలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడవ వార్డులో ఇండిపెండెంట్తో పాటు టిడిపి, జగన్ పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. అక్కడ ఇండిపెంటెంట్ అభ్యర్థికి కాంగ్రెస్ మాజీ మంత్రి చెంగారెడ్డి మద్దతు ఇస్తున్నారు. దీంతో జగన్ పార్టీ వర్గీయులు ఇండిపెంటెంట్కు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల చర్యకు నిరసన వ్యక్తం చేస్తూ చెంగారెడ్డి పోలీసులపై మండిపడ్డారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామని, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
ఈ నేపథ్యంలో జగన్ పార్టీ మున్సిపల్ అభ్యర్థి కుమార్తో పాటు నగిరి నియోజక వర్గం ఇంచార్జి రోజా కూడా పోలీసు స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్-రోజావర్గీయులు ఘర్షణకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జీ జరిపి, ఇరు వార్గాలను చెల్లాచెదురు చేస్తూ, రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications