తెరాసలోకి మైనంపల్లి: పట్టు వీడని రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరుతో తీవ్ర అసంతృప్తికి గురైన మైనంపల్లి హనుమంతరావు మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరారు. కెసిఆర్ ఫామ్హౌస్కు చేరుకుని ఆయన తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిశారు. తెలుగుదేశం పార్టీలో మైనంపల్లి మల్కాజిగిరి సీటును ఆశించారు. అయితే, అందుకు చంద్రబాబు నిరాకరించారు.
కాంగ్రెసులో చేరడానికి ఆయన ప్రయత్నించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే, చివరకు తెరాసలో చేరారు. ఆయన మల్కాజిగిరి లోకసభ స్థానం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. కాగా, తెలుగుదేశం పార్టీలో మల్కాజిగిరి సీటు విషయంలో ఇంకా వివాదం సాగుతోంది.
రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. తాను మల్కాజిగిరి సీటు నుంచి పోటీ చేసి తీరుతానని ఆయన పట్టుబట్టారు. రేవంత్ రెడ్డితో టిడిపి నేతలు పయ్యావుల కేశవ్, సుజనా చౌదరి, సిఎం రమేష్ సమావేశమై చర్చలు జరిపారు. వారి చర్చలు అసంపూర్తిగా ముగిశాయి.
తెలుగుదేశం పార్టీ మల్లారెడ్డిని పోటీకి దించాలని నిర్ణయించింది. అందువల్ల చేవెళ్ల లోకసభ స్థానం నుంచి పోటీ చేయాలని టిడిపి నేతలు రేవంత్ రెడ్డికి సూచించారు. కానీ అందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదు. మల్లారెడ్డిని చేవెళ్లకు పంపి, తనకు మల్కాజిగిరి సీటు ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. ఇదిలావుంటే, ఈలోగా రాజ్యసభ సభ్యుడు టి. దేవేందర్ గౌడ్ తనయుడు వీరేంద్ర గౌడ్ ఆ సీటుకు పోటీకి వచ్చారు. తన కుమారుడికి మల్కాజిగిరి సీటు ఇవ్వాలని దేవేందర్ గౌడ్ పట్టుబడుతున్నారు.