బాబు-జగన్లకు షాక్, అవిశ్వాసంపై బీజేపీ ప్లాన్ ఇలా!, 'పీఎంవోలో జగన్ అనుచరులు'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ, వైసీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు లోకసభలో చర్చకు వచ్చే పరిస్థితులు ఉండవని భావిస్తున్నారు. సభలో కొనసాగుతున్న నిరసనలను కారణంగా చూపి సభను వాయిదా వేసే ఘటనలు పునరావృతం కావొచ్చని అంటున్నారు.
లోకసభ ఈ నెల 23వ తేదీలోపు ఎప్పుడైనా నిరవధిక వాయిదా పడవచ్చని చెబుతున్నారు. బడ్జెట్ మలివిడత సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉండాలి. పీఎన్బీ స్కాం, ఏపీకి ప్రత్యేక హోదా, కావేరీ వివాదం వంటి కారణాలతో విపక్షాలు ఆందోళన చేస్తుండటంతో సభ వాయిదా పడుతోంది.

సభ వాయిదాపై వ్యూహాత్మకంగా
నిత్యం సభ వాయిదా పడుతుండటంతో చర్చ లేకుండానే పలు బిల్లులను ఆమోదించింది. ఆర్థిక, ద్రవ్య వినిమయ బిల్లులు, గ్రాట్యుటీ పెంపు తదితరాలను అదే విధంగా గట్టెక్ించారు. బడ్జెట్ పరమైన వ్యవహారాలన్ని ముగియడంతో ఈ నెల 16న సభను నిరవధిక వాయిదా వేస్తారని భావించారు. ఉగాది పర్వదినం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం అన్ని పార్టీల ఎంపీలకు పార్లమెంటులో విందు ఏర్పాటు చేశారు. అంతకుముందే సభను నిరవధిక వాయిదా వేస్తారేమోనని భావిస్తున్నారు. అన్నాడీఎంకే సభ్యులు సభలో నిరసన తెలిపితే.. దాని ఆధారంగా వాయిదా వేయవచ్చునని అంటున్నారు.

పీఎంవోలో జగన్ అనుచరులు
జగన్ అనుచరులు ప్రధాని కార్యాలయంలోనే ఉంటున్నారని, దానికి బదులుగా ఆయనపై కేసుల్లో సడలింపులు వస్తున్నాయని సీఎం చంద్రబాబు శనివారం ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఇదంతా కుట్ర రాజకీయాల్లో భాగమేనని, రేపోమాపో జగన్పై ఉన్న కేసులన్నీ కొట్టేస్తారన్న ప్రచారమూ జరుగుతోందన్నారు.
ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని చంద్రబాబు అన్నారు. వైసీపీని ఎవరూ నమ్మడం లేదని, అందుకే ఆ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి స్పందన రాలేదన్నారు. కేంద్రం టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన గంటలోనే పలు పార్టీలు సానుకూలంగా స్పందించాయని, జాతీయ స్థాయిలో టీడీపీకి ఉన్న విశ్వసనీయతకు ఇదే నిదర్శనమన్నారు.

ఆ ముగ్గురి కుట్ర బయటపెట్టాం
అవిశ్వాస తీర్మానంపై లోకసభలో సోమవారం ఓటింగ్కు పట్టుబట్టాలని, డివిజన్ అడగాలని టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచించారు. ఆరుగురు సభ్యుల ఎంపీల బృందం రెండు రోజులు ఢిల్లీలోనే ఉండాలని, అన్ని పార్టీల నేతలనూ వ్యక్తిగతంగా కలవాలని, అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలన్నారు. ఇది అత్యంత కీలకమైన సమయమని, ఎంపీలంతా మరింత చురుగ్గా, ఉత్సాహంగా పనిచేయాలని, అవిశ్వాసంపై మనం సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకున్నామని, వైసీపీ, జనసేన, బీజేపీల మహాకుట్రను బయట పెట్టామని ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.

కేంద్రాన్ని ప్రశ్నించకుండా నన్ను అంటారా
కేంద్రాన్ని ప్రశ్నించకుండా జగన్, పవన్ కళ్యాణ్లు తనను విమర్శిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ సమయంలో నన్ను బలహీనపరిచి ఎవరికి లాభం చేకూరుస్తున్నారని, దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని, జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రజల గొంతు వినిపించామన్నారు. కేసుల మాఫీకే విజయసాయి రెడ్డి పీఎంవోల చుట్టూ తిరుగుతున్నారని, కేంద్ర పెద్దలకు పాదాభివందనాలు, ప్రదక్షిణలు దానిలో భాగమేనని ఆరోపించారు.

కేంద్రం కుట్రలు తిప్పికొడతాం
లోకసభలో అశోక్గజపతిరాజు, రాజ్యసభలో సుజనా చౌదరిలు సమర్థవంతంగా వాదన వినిపించారని, ఆ స్ఫూర్తి కొనసాగించాలని, రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు పోరాడాలని చంద్రబాబు సూచించారు. ఏపీతో చెలగాటమాడితే ఎంతటివారకైనా పరాభవం తప్పదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అన్యాయంగా, అశాస్త్రీయంగా విభజించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదని, ఇప్పుడు రాష్ట్ర సుస్థితరతను దెబ్బతీయాలని చూస్తున్న శక్తుల ఆటలు సాగనివ్వమన్నారు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టిన చరిత్ర ఆంధ్ర ప్రజలది అన్నారు.












Click it and Unblock the Notifications