నల్గొండ సీఐ...ఆంధ్రాలో ఇక్కడ ఇలా దొరికిండు
నిన్న మొత్తం కనిపించకుండా పోయి తీవ్ర కలకలాన్ని సృష్టించిన నల్గొండ సీఐ వెంకటేశ్వర్లు ఎట్టకేలకు గుంటూరు జిల్లాలో దొరికాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలోని ఒక రిసార్ట్ లో సీఐ ఉన్నట్లు గుర్తించిన నల్గొండ పోలీసులు ఇక్కడి పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో స్థానిక మెరైన్ పోలీసులు ఓ రిసార్టులో మారుపేరుతో రహస్యంగా తలదాచుకున్న సీఐ ని గుర్తించారు. సీఐతో కలిసి పోలీస్ బృందం బాపట్ల నుంచి నల్గొండకు బయలుదేరింది. మరికొద్ది గంటల్లో డిఐజీ ముందుకు సిఐ వెంకటేశ్వరావును ప్రవేశపెట్టనున్నట్లు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.
అదృశ్యమైన 24 గంటల తరువాత నల్గొండ టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆచూకీ లభించింది. ఆయన మిర్యాలగూడ సమీపంలో ఓ రిసార్టులో ఉన్నారని, కాసేపట్లో ఆయన నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ముందు హాజరవుతారంటూ తొలుత వార్తలు వెలువడ్డాయి. ఆయితే ఆ తరువాత ఆయన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఓ రిసార్టులో క్షేమంగానే ఉన్నారని ఐజీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మరోవైపు సీఐ కుటుంబ సభ్యులు కూడా నల్గొండ బయలుదేరినట్లు తెలుస్తోంది.