unstoppable2: టాలీవుడ్ ను శాసిస్తోన్న ఆ నలుగురిలో ఇద్దరు మీరేనా?
అన్ స్టాపబుల్-2 ఎపిసోడ్ 5 ప్రొమోను 'ఆహా' తాజాగా విడుదల చేసింది. అందులో ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, డి.సురేష్ బాబును బాలకృష్ణ ఇంటర్వ్యూ చేశారు. కార్యక్రమం మధ్యలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు కూడా వచ్చారు. ఈ సందర్భంగా అతిథులను బాలకృష్ణ అడిగిన ప్రశ్నలు కార్యక్రమాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా మార్చాయి.
థియేటర్లు లీజుకు తీసుకొని..
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి కొందరు నిర్మాతలు థియేటర్లను లీజుకు తీసుకొని నడిపిస్తున్నారు. వారిలో అల్లు అరవింద్, సురేష్ బాబు పేర్లు ఎక్కువగా చెబుతారు. మరో ఇద్దరు బడా నిర్మాతలను కలుపుకొని 'ఆ నలుగురు' అని వ్యాఖ్యానిస్తారు. చిన్న సినిమాలకు వీరు థియేటర్లు వ్వరని, దీనివల్ల చిన్న చిన్న కథానాయకుల భవిష్యత్తు దెబ్బతింటోందనే ఆరోపణలున్నాయి. అందుకే 'అన్ స్టాపబుల్2' లో బాలకృష్ణ 'ఆ నలుగురు' ఇద్దరు మీరే కదా అని నేరుగా అడిగేశారు. అంతేకాకుండా నెపోటిజం గురించి ప్రశ్నించారు. దీన్నిగురించి తాను మాట్లాడితే తనపై తప్పనిసరిగా ట్రోలింగ్ జరుగుతుందని, అయినా చెప్పక తప్పదంటూ అరవింద్ చెప్పిన సమాధానం ఏమిటనేది ఫుల్ ఎపిసోడ్ లోనే తేలబోతోంది. అంతే కాకుండా వీరసింహారెడ్డి సంక్రాంతికి విడుదలవబోతోంది కాబట్టి ఎన్ని థియేటర్లు ఇస్తారు? అని బాలయ్య అడిగారు.
చిన్న సినిమాలను బతికించడం కోసం దాసరి..
గతంలో చిన్న సినిమాలను బతికించడానికి దాసరి నారాయణరావు ఎంతో తాపత్రయపడేవారు. తర్వాత కాలంలో తెలంగాణ ప్రభుత్వం మూడు ప్రత్యేక కమిటీలను కూడా నియమించింది. థియేటర్లు ఎవరు లీజుకు తీసుకున్నారు? చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వడంలేదా? చిన్న సినిమాలు తీసే నిర్మాతల పరిస్థితి ఏమిటి? తదితరాలన్నింటిపై విచారణ చేపట్టింది. తాజాగా బాలకృష్ణ కూడా మరోసారి ఆ ప్రశ్నను నేరుగా వారి ముఖంమీదే అడిగేయడంతో వారిద్దరూ ఏం చెప్పారనేది ఆసక్తికరంగామారింది.
తెలుగు సినిమా ఫుల్ మీల్స్ లాంటిది
అల్లు అరవింద్, సురేష్ బాబును చూపించి తనకు భలే దొంగ, మంచిదొంగ సినిమాలే గుర్తుకువస్తున్నాయి అంటే.. సురేష్ బాబు కథానాయకుడు, దేశోద్ధారకుడులాంటి పేర్లు చెప్పమంటారు. తెలుగు సినిమా ప్రత్యేకత గురించి అడగ్గా ఫుల్ మీల్స్ భోజనం లాంటిదని చెప్పారు. నెపోటిజంతోపాటు ఆ నలుగురు అన్న ముద్రపై ఈ ఎపిసోడ్ లో నిర్మాతలిద్దరూ ఎటువంటి స్పష్టత ఇచ్చారనేది ఫుల్ ఎపిసోడ్ లో తేలబోతోంది.