టిడిపి అవిశ్వాసం!: బాబును కలిసి ఏడ్చిన నన్నపనేని
హైదరాబాద్: సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు సభాపతి పైన అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ వద్ద ఆందోళన చేపట్టారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా సభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం, కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు స్పీకర్ ఛాంబర్ ఎదుట పోటీగా బైఠాయించారు. తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేశారు. బిల్లు పైన వెంటనే సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు.

బాబును కలిసి కంటతడి పెట్టిన నన్నపనేని
తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును కలిసి కంటతడి పెట్టారు. ఉదయం ఆమె కౌన్సిల్ మీడియా పాయింటు వద్ద కిందపడిన విషయం తెలిసిందే. స్పీకర్కు తెరాస ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేసిన అనంతరం బాబును కలిశారు. తమను కిందపడేసిన ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని చైర్మన్ను కోరినట్లు చెప్పారు.
ఇబ్బంది పడితే పశ్చాత్తాపపడుతున్నా: స్వామిగౌడ్
తన వల్ల నన్నపనేని ఇబ్బంది పడితే పశ్చాత్తాపం చెందుతున్నట్లు తెరాస ఎమ్మెల్సీ స్వామి గౌడ్ చెప్పారు. అనుకోకుండా జరిగిన సంఘటనతో నన్నపనేని కిందపడ్డారన్నారు.
బాబుకు తీరిక లేదా: హరీష్
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ తీరును చూసి సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ప్రజలు అసహ్యించుకుంటున్నారని తెరాస సిద్దిపేట శాసన సభ్యుడు హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు అనుకూలమంటూనే మరోవైపు చర్చ జరగకుండా టిడిపి అడ్డుకుంటోందని ఆరోపించారు. భోపాల్ వెళ్లేందుకు బాబుకు సమయం దొరికింది కానీ తెలంగాణ బిల్లు వచ్చే సమయానికి సభకు వచ్చే తీరిక మాత్రం లేదా అని ప్రశ్నించారు. సీమాంధ్ర టిడిపి ఎమ్మెల్యేలు స్పీకర్ ఛాంబర్ నుండి బయటకు రావాలన్నారు. అభ్యంతరాలుంటే చర్చలో పాల్గొనాలన్నారు.












Click it and Unblock the Notifications