దేశంలో బెస్ట్ సీఎంగా చంద్రబాబు.. ఏ స్థానంలో అంటే!
సినిమాల్లో మంచి నటన కనపరిచినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి. అలాగే ప్రభుత్వాలను నడిపే వ్యక్తులకు కూడా అవార్డులిచ్చే సంస్థలున్నాయి. మనదేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, వాటి అధినేతలు ఏవిధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు? అనే విషయంలో ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ జాబితాలో దక్షిణ భారతదేశానికి చెందిన ఇద్దరు ముఖ్యమంత్రులు టాప్-5 జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే
ముఖ్యమంత్రుల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఐదోస్థానంలో నిలిచారు. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రెండో స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, నాలుగో స్థానంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిలిచారు. స్టాలిన్కు 4.7 శాతం ఓట్లు రాగా, చంద్రబాబుకు 4.6 శాతం ఓట్లు వచ్చాయి. ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలలకే చంద్రబాబు ఐదో స్థానంలో నిలిచారని, త్వరలోనే అన్ని స్థానాలను దాటుకొని మొదటి స్థానానికి చేరుకుంటారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

రాజధాని, పెట్టుబడులు రెండు కళ్లుగా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉమ్మడి ఏపీకి రెండుసార్లు చేయగా, విభజిత ఏపీకి రెండుసార్లు సీఎం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం తర్వాత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అయితే జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చంద్రబాబు జాగ్రత్తపడటంతో 164 సీట్ల సంచలన రికార్డుతో అధికారాన్ని చేపట్టారు. రాజధానిగా అమరావతి పనులను వెంటనే ఆయన పున:ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ జంగిల్ క్లియరెన్స్ ను శరవేగంగా చేపిస్తున్నారు. రాజధానిలో నిర్మాణాలు చేపట్టడంతోపాటు దానికి సమాంతరంగా పెట్టుబడులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications