ఏ ఆత్మతో మాట్లాడి ఎన్టీఆర్ పేరు మార్చారో?
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు ద్వారా యావత్ తెలుగుజాతిని బాధపెట్టే నిర్ణయాన్ని సీఎం జగన్ తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్టీఆర్ పేరు మార్చడమనేది వైసీపీ నేతలకు కూడా నచ్చలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడతామని స్పష్టం చేశారు. ఏ ఆత్మతో మాట్లాడి సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారో భగవంతుడికే తెలియాలన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జిల్లాకో వైద్య కళాశాలను తెచ్చిన విషయాన్ని లోకేష్ గుర్తుచేశారు. ప్రతిపక్షానికి భయపడే అసెంబ్లీ సమావేశాలను ఐదురోజులకే కుదించారని, ఎన్టీఆర్ పేరు ఎందుకు తొలగించారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీకి చెందిన రూ.400 కోట్ల నిధులను కొట్టేశారని ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు రాజధానుల పేరుతో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రం మూడు ముక్కలాట అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమిళనాడులో ఇలాంటి రాజకీయమే కొనసాగేదని, స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మ క్యాంటిన్లు కొనసాగిస్తున్నారని, తమిళనాడు మారిందని, జగన్ మాత్రం రివర్స్ గేర్ లో వెళుతున్నారన్నారు. రేపు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్లు మారిస్తే ఏమవుతుందని ప్రశ్నించారు. మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు, ఢిల్లీలోని విమానాశ్రయానికి ఇందిరాగాంధీ పేరు తొలగించలేదని, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. శాసనమండలిలో టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలంతా దీనిపై నిరసన తెలియజేసినట్లు లోకేష్ వెల్లడించారు.