కేంద్రం అలా చేస్తుందనుకోను.. హిందీ వివాదంపై లోకేష్ కామెంట్స్..!
జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రాలపై రుద్దాలన్న కేంద్రం ప్రయత్నాలపై దక్షిణాది నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ తన అభిప్రాయం వెల్లడించారు. జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన సదస్సుకు హాజరైన లోకేష్.. హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు స్పందించారు. కేంద్రం అలా చేస్తుందనుకోవడం లేదన్నారు.
త్రిభాషా సూత్రం అమలు వల్ల మాతృభాషలకు అన్యాయం జరుగుతుందంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోకేష్ ను అదే విషయం అడిగితే అది సరికాదని తేల్చేశారు. హిందీని అయితే బలవంతంగా తమపై రుద్దుతారని అనుకోవడం లేదన్నారు. జర్మనీ, జపాన్ లలో ఎన్నో ఉద్యోగాల కోసం భారతీయులు వెళ్తున్నారని, కాబట్టి ఆ భాషలు సైతం నేర్చుకోవాల్సిందేనన్నారు. ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ల ప్రభావం ఏపీపై ఉంటుందా అని అడిగిన మరో ప్రశ్నకు లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. కర్నాటకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై, తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి తన తండ్రి చంద్రబాబు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఆయన ఏపీ అభివృద్ధి చూసుకుంటారని, తాను మాత్రం టీడీపీ కార్యకర్తగానే ఉంటానని లోకేష్ స్పష్టం చేశారు. సీఎం కుమారుడిగా ఉండటం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications