పవన్ కల్యాణ్తో విభేదాల్లేవు, పోటీ చేస్తా: నారా లోకేష్
హైదరాబాద్: జనసేన అధినేత, సినీ హీరో పవర్ కల్యాణ్తో విబేధాలు లేవని, పవన్ కల్యాణ్ అభివృద్ధికి వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నాయుడు అభిప్రాయపడ్డారు. తమ కుటుంబ ఆస్తులను వెల్లడించడానికి బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఆ విషయం చెప్పారు.
ఆక్వా ఫుడ్ కంపెనీ విషయం పవన్ సందేహాలకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని పవన్ అన్నారని లోకేష్ చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందకుండా, కంపెనీలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని వైసీపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.
లా అయితే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. భోగాపురంకు వ్యతిరేకం, ఆక్వాను, రాజధానిని అడ్డుకుంటున్నారని, రాయలసీమలో సోలార్ ఫ్లాంట్లను పెట్టనీయరని...అన్నిటిని అడ్డుకుంటే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని లోకేష్ ప్రశ్నించారు.
తనపై బురద జల్లడమే వైకాపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేవని, ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒకసారైనా కలిసి అన్ని విషయాలు చర్చించుకుంటామని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ ఇస్తే తప్పకుండా పోటీ చేస్తానని లోకేశ్ స్పష్టం చేశారు.