టెక్కీలకు లోకేష్ పాఠాలు, బాబుతో సాధ్యమని యువత
హైదరాబాద్/బెంగళూరు: రైతుల బిడ్డలను పెద్ద జీతాలు పొందే ఇంజనీర్లుగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ విధానాలను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని తెలుగు సాఫ్టువేర్ ఇంజనీర్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన సమావేశంలో తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ అన్నారు.
రైతు బిడ్డల్ని ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలని టెక్కీలకు లోకేష్ పిలుపునిచ్చారు. తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఐటి నిపుణుల సమావేశానికి లోకేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 700 ఇంజనీరింగ్ కాలేజీలను నెలకొల్పారని తెలిపారు.
నిజాం సర్కార్కు హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి 200 సంవత్సరాలు పడితే, సైబరాబాద్ను తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసి చూపెట్టారన్నారు.
ఎపి అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశంతోనే సాధ్యమని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని టిడిపి యువ నేతలు బెంగళూరులో పిలుపునిచ్చారు. హైదరాబాదుతో పాటు బెంగళూరులో తెలుగుదేశం ఐటి నిపుణుల యువ శంఖారావం జరిగింది.
కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు ఓటు వేస్తే జరిగే పరిణామాలను గ్రామాల్లో వివరించాలన్నారు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభించాలంటే తిరిగి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఇప్పటి నుండి శ్రమించాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టెక్కీలతో పాటు యువనేతలు పరిటాల శ్రీరామ్, చింతకాయల విజయ్, కరణం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.