ఏడాదిపాటు ఇంటికి రానని బ్రాహ్మణికి చెప్పాను: నారా లోకేష్
యువగళం పేరుతో సుదీర్ఘమైన పాదయాత్రకు సిద్ధమవుతున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. యాత్ర చంద్రబాబునాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో ఈనెల 27వ తేదీన ప్రారంభం కాబోతోంది. తాజాగా కొన్ని షరతులతో ప్రభుత్వం కూడా అనుమతులు జారీచేసింది. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు లోకేష్ నడవబోతున్నారు.
పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించుకుంటూనే దాదాపు ఎక్కువ సమయం ఇంటికే వెచ్చించారు లోకేష్. తాజాగా యాత్ర ప్రారంభం కాబోతున్న సందర్భంగా తాను ఏడాదిపాటు ఇంటికి రానని బ్రాహ్మణికి చెప్పానని, కుమారుడు దేవాన్ష్ కు చెప్పానన్నారు. కుటుంబం నుంచి తనకు వచ్చే మద్దతుతోనే పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేస్తాననే నమ్మకం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెలో పండగ జరుపుకున్న చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబం హైదరాబాద్ కు చేరుకుంది. ఎక్కువ సమయం కుమారుడితో గడుపుతూనే యువగళానికి కావల్సిన అన్ని ఏర్పాట్లను లోకేష్ పూర్తిచేశారు.
నిన్నటివరకు ప్రభుత్వం అనుమతిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగినప్పటికీ కొన్ని షరతులతో కూడిన అనుమతులివ్వడంతో ఏర్పాట్లన్నీ షురూ అయ్యాయి. పాదయాత్రలో ఎక్కడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదనే షరతుతో చిత్తూరు జిల్లా ఎస్పీ అనుమతులు మంజూరు చేశారు. కుప్పంలో ప్రారంభమై దాదాపు రాష్ట్రంలోని 150 నియోజకవర్గాలను కలుస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో యాత్ర ముగియనుంది. పాదయాత్ర కోసం ప్రత్యేకంగా పాటలు రూపొందించారు.