ఏంకావాలో చూడండి: బాబు ఆగ్రహంతో దిగొచ్చిన మోడీ!, వెంకయ్య చక్రం
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బీజేపీ పైన, ప్రధాని నరేంద్ర మోడీని నేరుగా నిలదీశారు. చంద్రబాబు నిలదీత నేపథ్యంలో ప్రధాని మోడీ ఒకింత తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఏపీకి ఆర్థిక సాయం, ఇతర హామీల పైన ఢిల్లీ బీజేపీ నేతలు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. సోమవారం మధ్యాహ్నం జైట్లీని టిడిపి నేతలు సుజనా చౌదరి, సీఎం రమేష్ కలిశారు.
అదే సమయంలో ప్రధాని మోడీ కూడా చంద్రబాబు లేవనెత్తిన అంశాల పైన స్పందించారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తుతున్న అంశాల పైన ఏపీ సీఎం చంద్రబాబును సంప్రదించాలని ప్రధాని మోడీ కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీకి సూచించారని తెలుస్తోంది.
టిడిపి దూరమైతే..: బాబు హెచ్చరికతో మోడీ అప్రమత్తం!
ప్రధాని మోడీని వెంకయ్య ఈ రోజు కలిశారు. ఏపీలో తాజా పరిస్థితులు, ప్రజల ఆగ్రహం, విపక్షాలు, మిత్ర పక్షం టిడిపి ఆందోళన పైన ఆయన వివరించారని తెలుస్తోంది.
మిత్ర పక్షాల మధ్య అంతరం మంచిది కాదని ఈ సందర్భంగా వెంకయ్య చెప్పారని తెలుస్తోంది. సాధ్యమైనంత మేరకు, సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. అలాగే, ప్రత్యేక హోదా అంశం పైనా చర్చించారు. ఏపీలో బీజేపీపై ఆగ్రహం పెల్లుబుకకుండా, అలాగే టిడిపితో దోస్తీ తెగకుండా వెంకయ్య చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది.
మోడీ ఆదేశాలతో సుజనతో భేటీ
చంద్రబాబు లేవనెత్తుతున్న అంశాలను పరిశీలించాలని ప్రధాని మోడీ ఆదేశించిన నేపథ్యంలో కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడులు టిడిపి నేత సుజనా చౌదరితో భేటీ అయ్యారు. ఏపీకి ఏం సాయం చేయాలి, ఎలా చేయాలనే అంశంపై చర్చించనున్నారు.