షార్కు నరేంద్ర మోడీ: ఏపీ సమస్యలు బాబు ఏకరువు!
నెల్లూరు: లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుండి సాధ్యమైనంత సాయం కోసం, కొత్త రాజధాని ఏర్పాటు కోసం, అలాగే రుణమాఫీ తదితర అంశాల పైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా చంద్రబాబు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆదివారం సాయంత్రం కలుస్తారు. ఏపీకి సాయం చేయాలని ఆయన కోరనున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ కేంద్రం నుండి సోమవారం ఉదయం శాస్త్రవేత్తలు పీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. దీనిని నరేంద్ర మోడీ, చంద్రబాబు, గవర్నర్ నరసింహన్లు ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఇందుకోసం నరసింహన్, చంద్రబాబు షార్రకు చేరుకున్నారు. వీరు షార్లోని చంద్రయాన్ అతిథి గృహంలో వీరు సేద తీరుతున్నారు.
మోడీ రాక నేపథ్యంలో చంద్రబాబు ఆయనను కలిసి ఏపీకి కేంద్రం సాయం విషయమై చర్చించనున్నారు. అలాగే రుణమాఫీ పైన కూడా చర్చిస్తారు. విద్యుత్ లోటు పైన కూడా చర్చిస్తారు. ఎన్నికల హామీలో చంద్రబాబు నాయుడు రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన చర్చించనున్నారు.
ఏపీ విద్యుత్ కొనుగోలు
విద్యుతో లోటును అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కర్నాటక, తమిళనాడుల నుండు విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. కర్నాటక నుండి 100, తమిళనాడు నుండి 200 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేస్తోంది. కర్నాటకతో ఒప్పందం మంగళవారం నుండి అమలులోకి రానుంది. కాగా, విద్యుత్ పొదుపును పాటించాలని చంద్రబాబు ఏపీ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
విద్యుత్ రంగంలో ఏపీని మోడల్గా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారిస్తామన్నారు. రాష్ట్రంలోని పవర్ ప్రాజెక్టుల కోసం కేంద్ర విద్యుత్ సంస్థలు లోన్ రూపంలో సాయం అందిస్తాయని చంద్రబాబు చెప్పారు.