చంద్రబాబుకు శరద్ పవార్ ఫోన్-ఇండీ కూటమిలోకి ఆహ్వానం..! 48 గంటలు అందుకేనా ?
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం ఇప్పుడు జాతీయ స్ధాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బలమైన వైసీపీని ఢీకొట్టి కూటమి సాధించిన రికార్డు విజయం ఇప్పుడు దేశం దృష్టినాకర్షిస్తోంది. అంతే కాదు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో భాగంగా పోటీ చేసి గెలిచిన చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి ఇప్పుడు జాతీయ స్ధాయిలో రెండు ప్రధాన కూటముల నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

ఏపీలో అసెంబ్లీ సీట్లతో పాటు భారీ ఎత్తున లోక్ సభ సీట్లు కూడా సాధించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ స్ధాయిలో ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరిస్తోంది. తాజా అంచనాల ప్రకారం ఇవాళ జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ ఏపీలో 16 ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతోంది. దీంతో మ్యాజిక్ మార్కుపైన కేవలం 20 సీట్లతో ఉన్న ఎన్డీయేకు ఇప్పుడు చంద్రబాబు కీలకంగా మారిపోయారు. ఈ నేపథ్యంలో ప్రదాని మోడీతో పాటు అమిత్ షా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అంతే కాదు చంద్రబాబుకు ఎన్డీయే కన్వీనర్ పోస్టును కూడా ఆఫర్ చేశారు. అయితే చంద్రబాబు మాత్రం తనకు నిర్ణయం తీసుకోవడానికి 48 గంటల సమయం కావాలని వారిని కోరారు. దీని వెనుక మరో కీలక కారణం ఉంది. మోడీ-షా ఫోన్ కు ముందే ఇండియా కూటమి నుంచి కూడా చంద్రబాబుకు ఫోన్ కాల్స్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇండీ కూటమిలో కీలకంగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చంద్రబాబుకు ఫోన్ చేసి తమ కూటమిలో చేరాలని ఆహ్వానించారు. దీనిపై కూడా చంద్రబాబు వెంటనే స్పందించలేదు. పార్టీ నేతలతో చర్చించి ఎన్డీయేలోనే ఉండాలా లేక ఇండీ కూటమిలో చేరాలా అన్న దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications