ఏపీలో కూటమి క్లీన్ స్వీప్ - సొంతంగానే టీడీపీ మెజార్టీ - మూడో స్ధానంలో వైసీపీ..!
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సంచలన విజయం దిశగా సాగుతోంది. కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోనూ కూటమి అభ్యర్ధులు సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ కంచుకోటల్ని బద్దలు కొడుతూ కూటమి సాధిస్తున్న విజయాలు రికార్డుల్ని తిరగరాసేలా ఉన్నాయి. మొత్తం మీద కూటమి దాదాపు 158 సీట్లతో రికార్డు స్థాయి విజయం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో టీడీపీ 130 సీట్లు సాధిస్తోంది. ఆ తర్వాత స్ధానంలో జనసేన నిలుస్తుండగా.. వైసీపీ మూడో స్ధానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్ధితి.

రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో తాజా సమాచారం ప్రకారం టీడీపీ 133 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. జనసేన 19 సీట్లతో రెండో స్ధానంలో నిలుస్తోంది. వైసీపీ కేవలం 16 సీట్లతో మూడో స్ధానం దక్కించుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. బీజేపీ మరో 7 సీట్లలో ఆధిక్యంలో ఉంది. తద్వారా కూటమి అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ 2019 ఎన్నికల్లో సాధించిన 151 సీట్ల విజయాన్ని కూటమి ఈసారి మించిపోయింది.
మరోవైపు తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. 1994 ఎన్నికల తర్వాత టీడీపీకి రాష్ట్రంలో దక్కిన అతి పెద్ద విజయం ఇదే. పోటీ చేసిన 144 సీట్లలో టీడీపీ 133 సీట్లలో గెలవడం చరిత్రగా నిలవబోతోంది. దాదాపు 93 శాతం స్ట్రైక్ రేట్ తో టీడీపీ సాధించబోతున్న విజయం రాష్ట్రంలో అన్ని లెక్కల్ని మార్చేసేలా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ తర్వాత రెండో స్ధానంలో ఎన్డీయే మిత్రపక్షం జనసేన నిలవబోతుండటం మరో విశేషం. వైసీపీ మాత్రం చరిత్రలోనే అత్యంత చెత్త పరాజయాన్ని మూటగట్టుకోబోతోంది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే వైసీపీ 16 సీట్లకు పరిమితమయ్యేలా ఉంది.












Click it and Unblock the Notifications