వైసీపీ నుంచి కూటమి ఖాతాలోకి మరో మూడు రాజ్యసభ సీట్లు, ముహూర్తం ఫిక్స్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి - వైసీపీ మధ్య కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో వైసీపీ నుంచి పెద్ద సంఖ్య లో నేతలు కూటమి పార్టీల్లో చేరారు. ఇప్పుడు చేరికలు నిలిచిపోయాయి. కాగా.. కూటమి పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మరో మూడు వైసీపీ రాజ్యసభ స్థానాలు కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి. ఇందుకు ముహూర్తం ఖరారైంది.
ఏపీలో కూటమికి రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసారు. అందులో విజయ సాయిరెడ్డి రాజకీయాలకు ప్రస్తుతం దూరంగా ఉన్నారు. అదే విధంగా బీదా మస్తానరావు, మోపిదేవి వెంటక రమణ టీడీపీలో చేరగా.. ఆర్ క్రిష్ణయ్య బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో.. ప్రస్తుతం పెద్దల సభలో వైసీపీ బలం 7కి పడిపోయింది.

కాగా, మరో ముగ్గురు వైసీపీ సభ్యుల స్థానాలు కూటమి ఖాతా లో చేరనున్నాయి. 73 మంది రాజ్యసభ ఎంపీలు ఈ ఏడాది పదవీ విరమణ చేసి మాజీలు కానున్నారు. ఏపీ నుంచి వైసీపీ సభ్యులుగా ఉన్న అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ సత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా అలాగే టీడీపీ నుంచి సానా సతీశ్ రిటైర్ అవుతున్నారు. ఈ ఏడాది జూన్ 21న ఈ నలుగురు పదవీ విరమణ చేయనున్నారు.
ఈ మేరకు తాజాగా రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. కాగా.. టీడీపీ నుంచి రైటర్ అవుతున్న సానా సతీశ్ కు తిరిగి రెన్యువల్ దక్కుతుందా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. వైసీపీ నుంచి ఖాళీ అయ్యే మూడు స్థానాలు.. అసెంబ్లీలో కూటమికి పూర్తి స్థాయిలో బలం ఉండటంతో వారికే ఈ మూడు స్థానాలు దక్కనున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ మెజార్టీ వాటా తీసుకుంటోంది.
జనసేనకు ఇప్పటి వరకు ఒక్క సీటు కూడా పెద్దల సభలో లేదు. దీంతో.. ఇప్పుడు ఖాళీ అయ్యే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, బీజేపీ - జనసేన చెరొకటి తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతల సమాచారం. జనసేన నుంచి ఒక సినీ ప్రముఖుడికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. అదే విధంగా ప్రముఖ పారిశ్రామిక వేత్త సైతం పవన్ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు ఇప్పటి కే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో.. జూన్ నుంచి వైసీపీకి లోక్ సభలో నలుగురు.. రాజ్యసభలో నలుగురు మాత్రమే ఎంపీలుగా కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications