వైసీపీ దూకుడుకు వైజాగ్ లో బ్రేక్ ? కూటమి తాజా ప్లాన్..!
ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినా రాష్ట్రవ్యాప్తంగా స్దానిక సంస్థలపై ఇంకా వైసీపీ పట్టు కొనసాగుతూనే ఉంది. మెజార్టీ స్థానిక సంస్థల్లో పీఠాలు ఇంకా వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. దీంతో వీటిని చేజిక్కించుకునేందుకు కూటమి పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే వాటిని అడ్డుకునేందుకు వైసీపీ కౌంటర్ ప్లాన్లు కూడా వేస్తోంది. దీని ఫలితమే తాజాగా వెలువడిన కడప జడ్పీ సహా కొన్ని స్దానిక సంస్థల ఫలితాల్లో వైసీపీ హవా. దీంతో కీలకమైన విశాఖ కార్పోరేషన్ లో వైసీపీకి అవకాశం ఇవ్వకుండా కూటమి ఎత్తులు వేస్తోంది.
గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ లో వైసీపీ హవాకు చెక్ పెట్టేందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే స్థానిక సంస్థల్లో నాలుగేళ్ల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టకుండా నిషేధం ఉండటంతో చేసేదేమీ లేక తెరవెనుక ప్రయత్నాలు చేసింది. తాజాగా ఆ నిషేధం గడువు పూర్తి కావడంతో జీవీఎంసీ మేయర్ పీఠంపై కన్నేసిన కూటమి పార్టీలు వైసీపీ నుంచి కార్పోరేటర్ల ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం మొదలుపెట్టేశాయి.

దీంతో అప్రమత్తమైన వైసీపీ తమ కార్పోరేటర్లను హైదరాబాద్, బెంగళూరు క్యాంప్ లకు తరలించేసింది. అక్కడా సేఫ్ కాదనుకుంటే వారిని మలేషియాకు కూడా తరలించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప జడ్పీ సహా పలు చోట్ల ఇలాంటి క్యాంప్ రాజకీయాలతోనే పీఠాలు కాపాడుకున్న వైసీపీ ఇప్పుడు అదే ప్రయోగం విశాఖలోనూ రిపీట్ చేస్తోంది. దీంతో కూటమి పార్టీలు వైసీపీకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి.
విశాఖ కార్పోరేషన్ లో అవిశ్వాసం లెక్కలపై కూటమి అలర్ట్ అయింది. కూటమికి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్ల పాస్ పోర్టులు ఇప్పటికే ఆయా పార్టీలు సేకరించినట్లు తెలుస్తోది. కార్పోరేటర్లు మలేషియా లేదా మరో దేశంలో క్యాంప్ పెడతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే వైసీపీ కార్పొరేటర్లు బెంగళూరులో మకాం వేసినట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన వారిని తమవైపు తిప్పుకోవడం, కాపాడుకోవడంపై కూటమి ఫోకస్ పెడుతోంది.












Click it and Unblock the Notifications