నెల్లూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు వెనక ఉగ్ర హస్తం?
నెల్లూరు: జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన బాంబు పేలుడు వెనక అల్ ఉమా(హ్) ఉగ్రవాద సంస్థ హస్తమున్నట్లు పోలీసులు వర్గాలు భావిస్తున్నాయి. అంతేగాక, చిత్తూరు, కేరళలోని కొల్లాం, పుదుచ్చేరి కోర్టుల ప్రాంగణాల్లో ఇటీవల కాలంలో జరిగిన బాంబు పేలుళ్లకు ఇది కొనసాగింపనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, నెల్లూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో సోమవారం జరిగిన బాంబు పేలుడు ఘటన తాలూకు భయాందోళన నగర వాసుల్ని ఇంకా వీడలేదు. గతంలో ఎన్నడూ నెల్లూరు జిల్లాలో ఈ తరహా పేలుడు సంభవించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.
చాలా తక్కువ స్థాయి పేలుడు జరిగిందని, బాంబు సామర్థ్యం కూడా కొద్దిపాటిదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ వైపు జిల్లా పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికి నగరవాసుల్లో మాత్రం వణుకు పోలేదు. జనం ఎక్కువగా లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పిందని అక్కడున్న వారు చెబుతున్నారు. అదే జనసమ్మర్ధ ప్రాంతంలో జరిగివుంటే నష్టం జరిగేదని చెబుతున్నారు.
కాగా, బాంబు పేలుడు ఘటనపై పోలీస్ శాఖ అన్ని కోణాల్లో దర్యాప్తున ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారులతో కూడిన బృందం మంగళవారం పేలుడు జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా పోలీసుల నుంచి వారు స్వాధీనం చేసుకున్న బాంబు, ప్రెషర్ కుక్కర్ శకలాలను వారు పరిశీలించారు.
గతంలో చిత్తూరు జిల్లా కోర్టు ప్రాంగణంలోనూ ఇదే తరహా పేలుడు సంభవించి ఉండడంతో చిత్తూరు సిసిఎస్ డిఎస్పీ రామకృష్ణ కూడా మంగళవారం నెల్లూరు నగరానికి వచ్చి పేలుడు ప్రదేశాన్ని పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.
రాష్ట్రంలోనే కాకుండా కర్నాటక రాష్ట్రం మైసూర్లోనూ, కేరళ రాష్ట్రంలో కొల్లాంలోనూ ఇదే తరహాలో కోర్టు ప్రాంగణంలో జరిగిన వివిధ బాంబు పేలుళ్లకు, ప్రస్తుతం నెల్లూరులో జరిగిన ప్రెషర్ కుక్కర్ బాంబు పేలుడుకు సారూప్యత ఉందనే అభిప్రాయానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం.
దర్యాప్తు విషయాలను వారు గోప్యంగా ఉంచుతుండడంతో ఎటువంటి సమాచారం వెల్లడి కావడం లేదు. విదేశీ తీవ్రవాద సంస్థల సానుభూతి పరులు ఈ తరహా పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందనే కోణంలోనూ నిఘా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇదే తరహాలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.
ఒకవేళ కక్షిదారులనో, కోర్టు సిబ్బందిలో ఎవరినైనా బెదిరించే క్రమంలో ఇటువంటి తక్కువ స్థాయి పేలుడుకు, జనసమ్మర్ధం లేని సమయంలో పాల్పడి ఉంటారనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. కాగా, పేలుడు ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.