ఏపీలో కొత్త జిల్లాల కసరత్తు - ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ : ఎప్పుడు అమల్లోకి వచ్చేను..!!
ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చేదెప్పుడు. కొంత కాలం క్రితం వరకు వినిపించిన కొత్త జిల్లాల అంశం ఇప్పుడు తిరిగి తెర మీదకు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ కొత్త జిల్లాల పైన తిరిగి ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నంద్యాల ఉప ఎన్నిక వేళ తొలి సారిగా జగన్ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారుస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తరువాత గత ఏడాది దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసారు.

కొత్త జిల్లాల గురించి సీఎం ప్రస్తావన
అయితే, ఆ తరువాత రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు...రాజకీయ పరిణామాలతో ఈ అంశం పైన సీఎం ఫోకస్ పెట్టలేదు. ఇదే సమయంలో మార్చిలో జనగణన పూర్తయ్యే వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులను మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్ కార్యాలయం స్పష్టం చేసింది. కరోనా కారణంగా జనాభా గణన పూర్తి కాలేదు. ఇప్పుడు తాజాగా, పార్టీ ఎంపీలతో సీఎం జగన్ సమావేవమైన సమయంలో కొత్త జిల్లాల అంశం ప్రస్తావించినట్లు సమాచారం. కొత్తగా జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న దానిపై చర్చ జరిగింది.

కేంద్ర సెన్సెస్ లెక్కలు పూర్తయ్యాక
ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జగన్ పేర్కొనడంతో ఈ అంశం మరోమారు చర్చల్లో నిలిచింది. ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. ఇవి 25 లేదా 26 ఉంటాయని గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జిల్లాల కోసం ఏర్పాటైన రాష్ట్ర స్థాయి కమిటీ, ఉప సంఘాలు, జిల్లా కమిటీల వరుస సమావేశాలు హడావుడిగా జరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం కానున్న పట్టణానికి మిగిలిన నియోజకవర్గ కేంద్రాల నుంచి దూరం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని తాత్కాలిక, మధ్యకాలిక, శాశ్వత ప్రణాళికలతో వివరాలను సిద్ధం చేశారు.

26 జిల్లాలకు పెంపు ప్రతిపాదనలు సిద్దం
లోక్సభ స్థానాలు ప్రామాణికంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తే అవి 25కు పెరుగుతాయి. అరకు నియోజకవర్గ విస్తీర్ణం పెద్దగా ఉండటంతో దీన్ని రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, ఇతర భవనాలు, ప్రధాన రహదారుల వివరాలు సేకరించారు. వాటిని పరిశీలించారు. లోక్సభ నియోజకవర్గాల సరిహద్దులు, భౌగోళిక విస్తీర్ణం, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాలు, ఇతర వివరాలను సిద్ధం చేశారు.

నాలుగు ప్రాంతీయ మండళ్లతో సహా
ఒక వైపు మూడు రాజధానుల వ్యవహారం.. మరో వైపు ప్రాంతీయ మండళ్ల ఏర్పాటు పైన ఆలోచనలు చేస్తున్న సమయంలో.. తిరిగి కొత్త జిల్లాల అంశం తెర మీదకు వచ్చింది. ఇక, గతంలోనే శ్రీకాకుళం..ప్రకాశం జిల్లాల పార్లమెంటరీ జిల్లాలుగా విభజన పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఇక, తమ ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేయాలంటూ పలు ప్రాంతాల నేతలు డిమాండ్లు వినిపించారు. ప్రభుత్వం ఈ ప్రక్రియను నిదానం చేయటంతో ఆ ప్రతిపాదనలు అదే విధంగా నిలిచిపోయాయి.

మూడేళ్ల పాలన పూర్తయ్యే నాటికి ప్రకటించేలా
ఇక, ఇప్పుడు తిరిగి కేంద్రం నుంచి నిధులు వస్తాయని..కొత్త జిల్లాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ, కేంద్రం మాత్రం జనగణన ఎప్పుడు ప్రారంభించేదీ ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. దీంతో.. 2022 మే 30 నాటికి ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తవుతుంది. ఆ సమయానికి కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications