జగన్ కొత్తమంత్రుల్లో కొత్త టెన్షన్-సజ్జల కామెంట్స్ తో- తొలి కేబినెట్ భేటీలో క్లారిటీ దొరికేనా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తాజాగా సీఎం జగన్ మంత్రివర్గ ప్రక్షాళన చేశారు. ఇందులో పలువురు కొత్తమంత్రులు చోటు దక్కించుకున్నారు. వైసీపీలో ఎంతో పోటీ ఉన్నా తట్టుకుని వివిధ సమీకరణాలతో వారు కేబినెట్ బెర్తులు సాధించారు. అయితే వీరికి రెండేళ్ల పదవీకాలం మాత్రమే ఉండటం, చివరి ఏడాది ఎలాగో ఎన్నికల వాతావరణం ఉండటంతో ఓ అసంతృప్తి ఉంది. దీనికి తోడు ఏపీలో తాజాగా మారుతున్న రాజకీయ పరిణామాలు వారిలో గుబులు మరింత పెంచుతున్నాయి.
జగన్ కేబినెట్ మంత్రులు
జగన్ కేబినెట్ ప్రక్షాళన సందర్భంగా వివిధ సమీకరణాలతో పలువురు కొత్త మంత్రులు మంత్రివర్గంలో స్ధానం దక్కించుకున్నారు. జగన్ గతంలో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లకు జరగాల్సిన ప్రక్షాళన కాస్తా వివిధ కారణాలతో మూడేళ్లకు మారింది. దీంతో ఈ కొత్త మంత్రులకు రెండేళ్ల పదవీకాలమే దక్కింది. అదీ ఎన్నికల టీమ్ గా పేరు తెచ్చుకున్న ఈ మంత్రులు తక్కువ పదవీకాలంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో వారు వచ్చిందే కట్నం అన్న చందాన రెండేళ్ల పదవీకాలానికి ఫిక్స్ అయిపోయారు.
13న తొలి కేబినెట్ భేటీ
జగన్ కేబినెట్ ప్రక్షాళన తర్వాత ఈ నెల 13న తొలి కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నారు. ఇందులో మంత్రులతో తొలిసారి భేటీ కాబోతున్న జగన్ ..వారి ప్రాధాన్యతల్ని వివరించబోతున్నారు. అలాగే ఎన్నికల టీమ్ గా వారి బాధ్యతల్ని గుర్తు చేయబోతున్నారు.
దీంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధికార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు. అయితే ఈ కేబినెట్ భేటీకి ముందే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం పెరుగుతోంది. ముఖ్యంగా విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పొత్తులపై చేస్తున్న హడావిడి, దానికి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇస్తున్న కౌంటర్లు, ముందస్తు సంకేతాలు ఇప్పుడు మంత్రుల్ని కలవరపెడుతున్నాయి.
సజ్జల వ్యాఖ్యల టెన్షన్
జగన్ కేబినెట్ లో కొత్తగా చోటు సంపాదించిన మంత్రులు తమకు ఎలాగైనా రెండేళ్ల పదవీకాలం ఉంటుందని ఫిక్స్ అయ్యారు. ఈ మేరకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అయితే వీరికి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై తాజాగా పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ముందస్తు ఎన్నికల వ్యాఖ్యలు టెన్షన్ రేపుతున్నాయి. ఏడాది, రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు అంటూ చేసిన వ్యాఖ్యలతో ఈ రెండేళ్లలోపే ఎన్నికలు ఖాయమంటూ సజ్జల చెప్పేయడం వారిలో గుబులు రేపుతోంది. అసలే ఆలస్యంగా వచ్చిన పదవులకు ముందస్తు ఎన్నికలు గండంగా మారతాయా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
జగన్ క్లారిటీ ఇస్తారా?
ఇప్పటికే పాత మంత్రులు మూడేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని వెళ్లారు. ఇప్పుడు తమకు లభించిన రెండేళ్ల పదవీకాలం పూర్తిగా అనుభిద్దామని భావిస్తున్న తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు అధిష్టానం సిద్ధమవుతుండటం వారిలో గుబులు పెంచుతోంది. దీంతో మే 13న జరిగే కేబినెట్ భేటీలో జగన్ క్లారిటీ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ కేబినెట్ భేటీలో జగన్ స్వయంగా తమకు క్లారిటీ ఇస్తారని కొందరు మంత్రులు భావిస్తున్నారు. అలా జరగకపోతే తామే ఈ విషయంలో స్పష్టత కోరాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.