తిరుమలలో అప్పటివరకు వారికి వసతి గదుల కేటాయింపు రద్దు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల తాకిడి కొనసాగుతోంది. సోమవారం నాడు 71,595 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 28,981 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.89 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 22 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమలలో నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా జరుగనున్నాయి. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమౌతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు వేదమంత్రోచ్ఛారణల మధ్య ధ్వజారోహణం చేస్తారు శ్రీవారి అర్చకులు. రాత్రి 9 గంటలకు శ్రీమలయప్ప స్వామివారిని పెద శేష వాహనంపై ఊరేగిస్తారు. 5న ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
6వ తేదీన ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం ఒంటిగంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంలో శ్రీవారిని ఊరేగిస్తారు. 7న ఉదయం 8 గంటలకు కల్పవృక్షం, సాయంత్రం 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై దేవేరులతో కలిసి దర్శనం ఇస్తారు.

8న ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 వరకు గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు శ్రీవారు. 9వ తేదీన ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, 7 గంటలకు గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.
10వ తేదీన ఉదయం 8 గంటలకు సూర్యప్రభ, సాయంత్రం 7 గంటలకు చంద్రప్రభ, 11వ తేదీన ఉదయం 7 గంటలకు రథోత్సవం, సాయంత్రం 7 గంటలకు అశ్వ వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 12వ తేదీన ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం ఉంటుంది. అదే రోజు రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దాతలకు వసతి గదుల కేటాయింపును టీటీడీ అధికారులు రద్దు చేశారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు ఈ రద్దు కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో వచ్చే భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 4న ధ్వజారోహణం, 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు.












Click it and Unblock the Notifications