అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు: జగన్ పార్టీతో సీట్ల సర్దుబాటుపై తేల్చేసిన పవన్
అమరావతి: 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందనే ప్రచారంపై జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. మనకు ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో మన బలం ఏమిటో.. మనం ప్రభంజనం ఏమిటో చూపిద్దామని పేర్కొన్నారు.
చదవండి: కొత్త నాయకుడి ప్లాన్ చెప్తా, వైసీపీలో వారిని పక్కనపెట్టండి, సీఎం అవుతారు: జగన్పై శివాజీ
ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇతర పార్టీలతో సీట్ల సర్దుబాటు అయినట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. మనకు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏ పార్టీ అండా మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు.
స్పందించిన పవన్ కళ్యాణ్
తెలుగు రాష్ట్రాలలో జనసేన పలు పార్టీలతో పొత్తు పెట్టుకోనుందని ప్రచారం సాగుతోంది. తెలంగాణలో టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారని, ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని ప్రచారం సాగుతోంది. దీంతో జనసేన శ్రేణుల్లో గందరగోళం ఏర్పడుతోంది. జనసైనికులు ఎలాంటి గందరగోళం చెందకుండా ఉండేలా పవన్ తాజాగా ఆదివారం ప్రకటన చేశారు.
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు
'అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు, జనసేన,ఆ పార్టీ తో కలుస్తుంది,యీ పార్టీ తో కలుస్తుంది అని కొందరు అంటే, కలవడం ఏంటి? సీట్ల సర్దుబాటు కూడా అయిపాయిందని ఇంకొందరు అంటున్నారు; మనకి ఎ పార్టీ అండ దండా అక్కర్లేదు, "మన బలం జనం చూపిద్దాం ప్రభంజనం."' అని పవన్ ట్వీట్ చేశారు.
కన్ఫ్యూజన్ లేకుండా ప్రకటన
2019లో ఏపీలో జనసేన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు సాగుతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. సీట్ల సర్దుబాటు కూడా పూర్తయిందని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో అభిమానులు, కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ లేకుండా ప్రకటన చేశారు.
Recommended Video
తేల్చి చెప్పిన పవన్
పవన్ కళ్యాణ్ ప్రకటనతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఒంటరిగా వెళ్తారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఒంటరిగా అంటే టీడీపీ లేదా వైసీపీ లేదా బీజేపీ లేదా కాంగ్రెస్ వంటి కీలక పార్టీలతో కలవరని. లెఫ్ట్, బీఎస్పీ వంటి చిన్న పార్టీలతో కలవడం వేరే విషయం. చిన్న పార్టీలతో కలవడం మినహా పెద్ద పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని పవన్ తేల్చి చెప్పారు.