వాలంటీర్లు, సంక్షేమంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! ఏడాది పాలన వేళ..!
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న వేళ సీఎం చంద్రబాబు, తనయుడు నారా లోకేష్ తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో ఆయన సంక్షేమ పథకాలతో పాటు వాలంటీర్లపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన పెన్షన్ల పెంపు గురించి మాట్లాడుతూ కేవలం ఏపీలోనే ఇది సాధ్యమైందన్నారు. అలాగే సంక్షేమ పథకాల లబ్దిదారులకు చంద్రబాబు కీలక సూచనలు చేసారు.
2024-25 మధ్య కాలంలో 34 వేల కోట్ల పింఛన్ చెల్లించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. హామీ ఇచ్చినట్లుగానే పింఛన్ ఒకేసారి పెంచామన్నారు. ఏడాదికి రూ.34 వేల కోట్ల భరోసా పింఛన్ ఇస్తున్నది ఏపీలోనే అన్నారు. పింఛన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరినీ గౌరవిస్తామని చంద్రబాబు తెలిపారు. తీసుకున్న డబ్బును దుబారా ఖర్చు చేయకూడదని లబ్దిదారులకు సూచించారు. సంక్షేమంపైనే ఎప్పుడూ ఆధారపడకూడదని కూడా సూచించారు. సంక్షేమాన్ని ఆర్థిక చేయూతగా మార్చుకోవాలన్నారు.

అలాగే వాలంటీర్ల వ్యవస్ధపైనా చంద్రబాబు స్పందించారు. వాలంటీర్లు ఉంటేనే సాధ్యమన్నారు, కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడికే పింఛన్ అందిస్తున్నామని గుర్తుచేశారు. మరోవైపు వైసీపీపై స్పందిస్తూ.. బాబాయిని చంపారు, నాటి సీఎం చేతుల్లోనే కత్తులు పెట్టారన్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ సాక్షి పత్రిక బరితెగించిందని ఆరోపించారు. రౌడీ షీటర్, గంజాయి బ్యాచ్ కోసం తెనాలి వెళ్లి పరామర్శించారని జగన్ పై విమర్శలు గుప్పించారు. రైతుల పరామర్శకు 15 వేల మందిని వెంట బెట్టుకుని ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు కదా.. అమరావతిపై ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ సాక్షి డిబేట్ లో ఘటనపై వ్యాఖ్యానించారు. టాపిక్ డైవర్షన్ కోసమే పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ డ్రామా అన్నారు.

మరోవైపు కూటమి ఏడాది పాలనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే పెట్టుబడులు అన్నారు. దేశంలో లేని విధంగా అన్నక్యాంటీన్లు నడిపిస్తున్నామన్నారు. దీపం పథకం కింద గ్యాస్ సిలెండర్లు, ఆడపడుచులకు లోన్లు ఇస్తున్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని గుర్తుచేశారు. తల్లికి వందనం పథకం ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రతి తల్లి ఖాతాలో నగదును జమ చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి జోడెద్దులు అన్నారు.












Click it and Unblock the Notifications