పరిటాల రవిపై దాడి చేస్తారని తెలుసు, జెసి కుటుంబంతో విభేదాల్లేవు, 3 నెలలు ముందే పంపారు: చమన్
Recommended Video
అనంతపురం: టిడిపి నేత మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగిన వెంటనే తనకు ఆ విషయం తెలిసిందన్నారు. శత్రువులు తమపై దాడికి వ్యూహం పన్నుతున్నారని తాము అనుమానించామని, ఆ అనుమానాలు నిజమయ్యాయని అనంతపురం మాజీ జడ్పీ చైర్మెన్ చమన్ చెప్పారు.మూడు మాసాల ముందే రవి తనను బయటకు పంపాడని ఆయన గుర్తు చేసుకొన్నారు.
'పరిటాల, మద్దెల చెర్వు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమదే, వైఎస్ చెప్పినట్టు వింటే మరోలా ఉండేది'
ఓ తెలుగు ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చమన్ పలు విషయాలను వెల్లడించారు. పరిటాల రవి రాజకీయ జీవితం, పరిటాల శ్రీరాములయ్య, పరిటాల హరి హత్యలతో పాటు అనంతపురం జిల్లా రాజకీయాల గురించి ప్రస్తావించారు.
వైఎస్ కుటుంబంతో విబేధాలు, చెన్నారెడ్డి ఒప్పుకోలేదు: కందుల రాజమోహన్ రెడ్డి
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన గుర్తు చేసుకొన్నారు. తన కంటే ముందు నా చావు వార్త వినకూడదని పరిటాల రవి కోరుకొన్నాడని చమన్ గుర్తు చేశారు.
నా సోదరుడిని ఓడించాడు, వైఎస్ఆర్పై పోటీ, ముందే చెప్పా: కందుల రాజమోహన్ రెడ్డి
శత్రువులు కుట్ర పన్నుతున్నారని అనుమానించాం
శత్రువులు తమను అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నారని అనుమానించామని మాజీ అనంతపురం జడ్పీ ఛైర్మెన్ చమన్ చెప్పారు. పరిటాల రవి హత్యకు మూడు మాసాల ముందే తనను పిలిచి బలవంతంగా బయటకు పంపారని ఆయన చెప్పారు. ఇద్దరం కలిసి వెళ్దామని తాను పట్టుబట్టినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. కానీ, తనకు గన్మెన్లు ఉన్నారని ఆయన చెప్పారని చమన్ చెప్పారు. తన మీద అభిమానం ఉంటే వెళ్ళాలని రవి కోరుకొన్నారని చెప్పారు.రవి ఆదేశం మేరకు తాను బయటకు వెళ్ళాల్సి వచ్చిందని చెప్పారు. అయితే శత్రువులు దాడి చేస్తారని అనుమానం ఉందన్నారు. తమకు వచ్చిన సమాచారాన్ని పరిటాల రవికి చేరవేశానని ఆయన చెప్పారు. తన వద్ద కూడ ఆ సమాచారం ఉందని రవి చెప్పారని చమన్ గుర్తు చేసుకొన్నారు.
ఫ్యాక్షన్ అంతం కావాలని రవి కోరుకొన్నారు.
మంత్రిగా ఉన్న కాలంలోనే పరిటాల రవి ఫ్యాక్షన్ అంతం కావాలని కోరుకొన్నారని చమన్ గుర్తు చేశారు.2004 తర్వాత కూడ ఫ్యాక్షన్ అంతం కోసం పోరాటం చేయాలని రవి భావించాడని చమన్ గుర్తు చేసుకొన్నారు. అయితే ఆ సమయంలోనే పరిటాల రవి హత్యకు గురయ్యాడని చమన్ చెప్పారు. పరిటాల రవి కుటుంబంలో అందరూ కూడ మొండి ధైర్యం ఉన్నవారని చెప్పారు. పరిటాల శ్రీరాములయ్యతో సహ అందరు కూడ శత్రువులు దాడి చేస్తారని తెలిసి కూడ గుండె ధైర్యంతో వెళ్ళినవారేనని ఆయన చెప్పారు. శత్రువులు పొంచి ఉన్నారని తెలిసి శ్రీరాములయ్య వెళ్ళి హత్యకు గురయ్యారన్నారు. పోలీసులు ఉన్నారని తెలిసి పరిటాల హరి ఎన్కౌంటర్లో మృతి చెందాడన్నారు. శత్రువులు దాడి చేస్తారని తెలిసి పరిటాల రవి ధైర్యంగా నిలబడ్డాడని చమన్ చెప్పారు.
జెసి కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు
పరిటాల రవి కుటుంబానికి జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి వ్యక్తిగత విభేదాలు లేవని చమన్ చెప్పారు. రాజకీయంగా ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నవారని ఆయన గుర్తు చేశారు. పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో తాడిపత్రి నియోజకవర్గంలో టిడిపిని గెలిపించుకొనేందుకు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. అనంతపురం జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రవి ప్రయత్నించారని అందులో భాగంగానే తాడిపత్రిలో కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
శత్రువుల కదలికల సమాచారం
శత్రువుల కదలికల సమాచారం తమకు చేరుతోండేదని చమన్ చెప్పారు. తమ సమాచారం కూడ శత్రువులు సేకరించే వారని ఆయన అభిప్రాయపడ్డారు. తమకున్న ఇంటలిజెన్స్ వ్యవస్థ ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించేవారమని చమన్ చెప్పారు. గన్మెన్లు రక్షణగా ఉన్నారనే ధీమాగా రవి ఉన్నారని చమన్ గుర్తు చేసుకొన్నారు. ఏం జరిగినా రాకూడదని తనకు చెప్పారని ఆయన గుర్తు చేశారు.
జిల్లా పరిషత్ ఛైర్మెన్ చేయాలనుకొన్నారు
తనను రాజకీయాల్లో క్రియాశీలకంగా చూడాలని పరిటాల రవి భావించారని చమన్ చెప్పారు. చనిపోయే ముందు జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా చేయాలని తలపెట్టారన్నారు. కానీ, పరిస్థితులు అనుకూలించని కారణంగా తనను బయటకు పంపారని చమన్ చెప్పారు.అయితే తాను పోలీసులకు ఒక్క రోజు ముందే తాను వదినకు సమాచారం ఇచ్చానని చెప్పారు.