ఎన్టీఆర్ అవసరంలేదు: బాలకృష్ణ, జగన్కు లెజెండ్ పంచ్
విజయనగరం: హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈ దఫా ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం ఆయన వ్యక్తిగతమని, ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ విజయానికి పాటుపడడం ఆయన కుటుంబ సభ్యులందరి బాధ్యత, కర్తవ్యమని ఆ పార్టీ నేత, హీరో నందమూరి బాలకృష్ణ పునరుద్ఘాటించారు.
ఎవరినీ బొట్టుపెట్టి పిలవాల్సిన అవసరం ఉండదన్నారు. అయినా, జూనియర్ అవసరం ప్రస్తుతం పార్టీకి లేదన్నారు. బుధవారం విజయనగరంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తన సోదరి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేస్తున్న రాజంపేట లోకసభ స్థానంలో కూడా ఎన్నికల ప్రచారం చేస్తారా అన్న ప్రశ్నకు తన పర్యటన షెడ్యూల్లో ప్రస్తుతానికి రాజంపేట లేదన్నారు.
తన సోదరుడు నందమూరి హరికృష్ణకు టికెట్ కేటాయించకపోవడం గురించి అడిగితే... హరికృష్ణ సేవలకు పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు.
తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుది విజన్ 2020 అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 420 అని మండిపడ్డారు. తాను ఎదురు వెళ్లినా... తనకు ఎదురొచ్చినా వారికే నష్టమని బాలయ్య తన తాజా సినిమా లెజెండ్ డైలాగ్ వదిలారు.