నందిగామలో తంగిరాల సౌమ్యనే: జగన్ పార్టీ కూడా..
విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామ శాసనసభ నియోజకవర్గం నుంచి తంగిరాల ప్రభాకర రావు కూతురు తంగిరాల సౌమ్యను పోటీకి దించడానికి తెలుగుదేశం పార్టీ దాదాపుగా నిర్ణయించింది. నందిగామకు సెప్టెంబర్ 13వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. సౌమ్య తండ్రి తంగిరాల ప్రభాకర రావు మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది.
తంగిరాల సౌమ్యకు మద్దతుగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు తమ పార్టీలను బరిలోకి దింపకపోవచ్చునని భావిస్తున్నారు. దీంతో సౌమ్య విజయం ఖాయమైనట్లేనని భావిస్తున్నారు. అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీకి దింపాలనే ఆలోచనలో ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే జిల్లా నాయకత్వం మాత్రం అందుకు సుముఖంగా లేదని అంటున్నారు.
మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పోటీకి దించితే పోటీకి దించకూడదనే సంప్రదాయాన్ని పాటించే ఉద్దేశంతోనే కృష్ణా జిల్లా కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఇరు పార్టీల నేతలు కూడా తమలో తాము చర్చించుకున్నట్లు చెబుతున్నారు.
సౌమ్యను తెలుగుదేశం పార్టీ బరిలో నిలిపితే పోటీ పెట్టకూడదనే వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు జిల్లా నాయకత్వాలు నిర్ణయానికి వచ్చాయి. పైగా, తెలుగుదేశం పార్టీకి నందిగామ నియోజకవర్గంలో గణనీయమైన బలం ఉంది. తంగిరాల ప్రభాకర రావుకు కూడా మంచి పేరుంది.