ఏపీ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్, సచివాలయంలో మాత్రం కనిపించని జాగ్రత్తలు... తగ్గిన రాకపోకలు
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో స్ధానిక ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది.. కరోనా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం చేస్తున్న సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. కానీ కీలకమైన రాష్ట్ర సచివాలయంలో మాత్రం కరోనాకు సంబంధించి ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

ఏపీలో కరోనా ఎఫెక్ట్..
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా లేకపోయినా విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్న ప్రయాణికుల కారణంగా కొన్ని అనుమాస్పద కేసులు నమోదవుతున్నాయి. అయితే వీటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం సూచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలలను ముూసివేయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు విమానాశ్రయాలు, బస్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ధర్మల్ స్క్రీనింగ్ పరికరాలతో పాటు హ్యాండ్ శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచుతోంది. దీంతో ప్రజల్లో కాస్త భయాలు తగ్గించడంతో పాటు అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్ర సచివాలయంలో మాత్రం...
రాష్ట్రంలోని పలు రద్దీ ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరికరాల ఏర్పాటుతో పాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్న ప్రభుత్వం.. కీలకమైన రాష్ట్ర సచివాలయం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిత్యం వేలాది మంది సందర్శకులతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు వచ్చే సచివాలయంలో కరోనా వైరస్ నిర్ధారణ పరికరాలు కానీ కనీసం శానిటైజర్లు కానీ ఇప్పటికీ అందుబాటులో ఉంచలేదు. రాష్ట్రంలో పలు ప్రైవేట్
సంస్ధలు, థియేటర్స్, మాల్స్, సూపర్ బజార్లలోనూ కరోనా నిర్ధారిత పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహిస్తుంటే సచివాలయంలో మాత్రం ఆ పరిస్దితి లేదు. ప్రభుత్వ పాలనలో కీలకమైన అదికారులు, మంత్రులు తిరిగే ప్రాంతాల్లో కరోనా నిర్దారిత పరికరాలు అందుబాటులో లేకపోవడం, పరీక్షలు జరగకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల తరహాలో సచివాలయంలోనూ ఈ పరికరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Recommended Video

సచివాలయానికి తగ్గిన రాకపోకలు...
ఏపీ వ్యాప్తంగా కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ సచివాలయంలో మాత్రం వదిలేయడంపై సందర్శకులతో పాటు అధికారులు, మంత్రులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావంతో స్ధానిక ఎన్నికలు సైతం వాయిదా పడటం, విద్యాసంస్దలు మూతపడినా సచివాలయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో కొన్నిరోజులుగా సచివాలయంలో రాకపోకలు బాగా తగ్గాయి. చాలా అవసరమైతే తప్ప సందర్శకులు కానీ, మంత్రులు కానీ రావడం మానేశారు. దీంతో ప్రభుత్వ పాలనపైనా ప్రభావం పడే పరిస్ధితి.












Click it and Unblock the Notifications